కరీంనగర్ వాసికే మావోయిస్టు పీఠం...

Update: 2025-05-26 09:50 GMT

మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చత్తీస్ఘడ్ లో జరిగిన పోలీస్ ఎన్ కౌంటర్లో మృతి చెందడంతో ఆయన తరువాత మావోయిస్ట్ పార్టీ నేత ఎవరు అవుతారన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ఒకరు కాగా, ఆ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి మరొకరు కాగా పార్టీ సైద్ధాంతిక బాధ్యతలు చూస్తోన్న మల్లోజుల వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి ప్రస్తుత జగిత్యాల జిల్లా సారంగ పూర్ మండలం బీర్ పూర్ లో 1945లో జన్మించారు. ముప్పాళ్ల గోపాల్, శేషమ్మ దంపతులకు జన్మించిన ఆయన సైన్స్ పట్టా పొంది బీఈడీ పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో టీచర్ గా పని చేశారు. ఆ తర్వాత ఆయన పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో దాదాపు 15 ఏళ్ల పాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేశారు. 2004లో పీపుల్స్ వార్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమయి సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించింది. నాటి నుండి 2018 వరకు ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా నాయకత్వం వహించారు. దేశంలోని 13 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని బలోపేతం చేసి రెడ్ కారిడార్ ఏర్పాటు చేశారు. పార్టీ సిద్ధాంతాల పట్ల అత్యంత విధేయత కలిగిన గణపతికి అద్భుత వ్యూహకర్తగా పేరు ఉంది. అలాగే పార్టీకి నిధుల సేకరణలోను విజయవంతమైన నాయకుడిగా మావోయిస్ట్ పార్టీ అతన్ని గుర్తించింది. భారత దేశంలో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న వ్యక్తి గణపతి. ఇప్పటి దాకా పోలీసులు ఆయన ఆచూకి కనపెట్టిలేని రీతిలో అండర్ గ్రౌండ్ లో గడుపుతున్న వ్యక్తి. 2018 నవంబర్ లో ఆయన అర్థరైటిస్, ఉబ్బసం, మధుమేహం ఇతర వ్యాధుల కారణంగా , మరో వైపు వయో భారం వల్ల పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకుని ప్రస్తుతం చత్తీస్ ఘఢ్ఎన్ కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావుకు నాయకత్వం అప్పజెప్పారు.

పార్టీ ఎదుర్కొంటున్న ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో మళ్లీ గణపతే బాధ్యతలు తలకెత్తుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున ఎన్ కౌంటర్లు చేస్తుండటంతో ఆ పార్టీ రక్షణకు ఆయన వ్యూహాలు, అనుభవం పనికి వస్తుందన్న చర్చ సాగుతోంది. అయితే వయో భారం కారణంగా మరో సారి ఆ బాధ్యతలు నిర్వర్తించలేరన్న ప్రచారం మరో వైపు వినబడుతుంది. అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమ బాధ్యతల్లో ఆయన ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి వినిపిస్తున్న మరో పేరు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి. ఇతను మావోయిస్ట్ పార్టీలో అత్యంత నిపుణుడైన సైనిక నేతగా, గెరిల్లా దాడుల వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. ఇతను కూడా గణపతి పుట్టిన ప్రాంతమైన జగిత్యాల జిల్లాకు చెందిన వాడే. పీపుల్స్ వార్ గ్రూప్ నడుస్తోన్న 1990లోనే ఉద్యమ పార్టీలో చేరారు తిరుపతి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ని ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర కీలకమని మవోయిస్టు చరిత్ర చెబుతోంది. పీఎల్ జీఏ తొలి ప్లాటూన్ ఏర్పాటులో తిరుపతి అలియాస్ దేవ్ జి కీలక పాత్ర పోషించారు. 2007లో జరిగిన దంతేవాడ గిదం పోలీస్ స్టేషన్ దాడికి నాయకత్వం వహించింది దేవ్ జీనే. ఈ దాడితో ఆయన పేరు మార్మోగింది. ఆ తర్వాత 2013లో చత్తీస్ ఘడ్ సుకామా జిల్లా దర్బాలోయలో జరిగిన దాడి దేశ చరిత్రలోనే అత్యంత విషాదంగా చెప్పుకున్న దాడి. ఈ దాడిలో 32 మంది కిపైగా చనిపోయారు. చత్తీస్ ఘడ్ మాజీ హోం మంత్రి, సల్వాజుడం వ్యవస్థాపకుడు అయిన మహేంద్రకర్మ, నాటి చత్తీస్ ఘడ్ పీసీసీ చీఫ్ నందకూమర్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ పటేల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి వీసీ శుక్లా కూడా చనిపోయారు. ఈ దాడిని దేవ్ జీ, మల్లోజుల వేణుగోపాల్ రావు కలిసి ప్లాన్ చేసి అమలు చేసినట్లు పోలీసులు చెబుతారు. ఇలా దాడలకు ప్లాన్ చేయడంలోను, దాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో నిపుణిడిగా తిరుపతి అలియాస్ దేవ్ జీకి పేరు ఉంది. గతంలో నంబాల కేశవరావు పని చేసిన మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు చీఫ్ గా ప్రస్తుం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి పని చేస్తున్నారు. నంబాల కేశవరావు మృతితో పార్టీ చీఫ్ గా సైనిక నైపుణ్యం , దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేతగా దేవ్ జీకే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ దేవ్ జీ చీఫ్ గా పార్టీ ఎన్నుకుంటే అతని సారధ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రంగా స్పందించే దిశగా నడిపిస్తారని మాజీ మావోయిస్టులు చెబుతున్నారు.

మావోయిస్టు పార్టీలో సీనియర్ గా మల్లోజుల వేణు గోపాల్ అలియాస్ సోను ఉన్నారు. ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలోను, పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నారు. ఆజాద్ మరణం తర్వాత కేంద్ర కమిటి అధికార ప్రతినిధి బాధ్యతలను మల్లోజుల వేణు గోపాల్ నిర్వర్తిస్తున్నారు. ఈయన తెలంగాణ లోని పెద్ద పల్లి జిల్లా లో జన్మించారు, వెంకటయ్య, మధురమ్మకు ముగ్గురు కుమారులు, అందులో వేణు గోపాల్ చిన్న వాడు. పెద్ద పల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి ఆ తర్వాత ఐటీఐ లో రేడియో, టీవీ మెకానిజం కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత ఆ తర్వాత పై చదువులు చదివి ఎంటెక్ లో చేరారు. ఆస మయంలోనే ఉద్యమంలో చేరారు. ఉద్యమ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీ పిలుపు మేరకు వేణు గోపాల్ అటవీ బాట పట్టారు. మహారాష్ట్ర గడ్చిరోలి దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి నాయకత్వం వహించారు. పశ్చిమ కనుమల్లోని కేరళ నుండి గోవా వరకు పార్టీ విస్తరణలో వేణు గోపాల్ కీలక పాత్ర పోషించారు. 2010లో ఆజాద్ మరణం తర్వాత కేంద్ర కమిటీ అధికార బాధ్యతలు నిర్వర్తించారు. టెక్నాలిజీ వినియోగించే విషయంలో పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా మల్లోజుల వేణుగోపాల్ కు పేరు. శాటిలైట్ ఫోన్ల వినియోగించే దిశగా పార్టీని తీసుకెళ్లారు. 2010లో దంతెవాడ లో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి లో 70 మంది చనిపోయారు. దీని సూత్రదారుల్లో వేణు గోపాల్ ఒకరని పోలీసులు అనుమానిస్తున్నారు. 2013లో చత్తీస్ ఘడ్ సుక్మ దాడిలో కాంగ్రెస్ నేతల పై దాడి లో దేవ్ జీతో పాటు మల్లోజుల వేణు గోపాల్ ప్రధాన సూత్రదారుడిగా పేరుంది. పార్టీ మిలిటరీ వ్యూహాలు, దాడుల్లో పాల్గొనడమే కాకుండా ఆయనకు పార్టీ సిద్ధాంతల పట్ల అత్యంత పట్టు కలిగిన వ్యక్తిగా పేరుంది. 69 ఏళ్ల వేణు గోపాల్ తదుపరి మావోయిస్ట్ చీఫ్ గా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ సిద్ధాంతాల పట్ల పట్టు, సీనియారిటీ వంటి అంశాలు కలిసి వస్తుందన్న విశ్లేషణ ఉంది. అయితే వయోభారం, అనారోగ్య సమస్యలు, మతి మరుపు వంటి సమస్యలు ఆటంకం కావచ్చు అన్న చర్చ సాగుతోంది. అయితే ఈ ముగ్గురిలో ఎవరు మావోయిస్ట్ పార్టీ చీఫ్ అయినా.. వారు తెలుగు వారు అందునా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే.

Tags:    

Similar News