Priyanka Gandhi Criticises: అస్సాంలో రాజకీయ వివాదం: గౌరవ్ గొగొయ్ కుటుంబాన్ని లాగడం సరికాదు - ప్రియాంకా గాంధీ విమర్శ
గౌరవ్ గొగొయ్ కుటుంబాన్ని లాగడం సరికాదు - ప్రియాంకా గాంధీ విమర్శ
Priyanka Gandhi Criticises: అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేస్తున్న ఆరోపణలు తప్పుడు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. గౌరవ్ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడం సరైన పద్ధతి కాదని, ఇది విద్వేషపూరిత రాజకీయాల భాగమేనని ఆమె విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు రెండు రోజుల పర్యటనకు అస్సాం వచ్చిన ప్రియాంక, గువాహటి శివార్లలోని సోనాపుర్లో దివంగత ప్రముఖ గాయకుడు జుబీన్ గర్గ్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకా గాంధీ, "రాజకీయాల్లో రెండు రకాల నాయకులు ఉంటారు. ఒకరు సానుకూలత, ప్రేమపూరిత రాజకీయాలు చేసేవారు, మరొకరు విద్వేషం పంచేవారు. గౌరవ్ గొగొయ్ ప్రేమపూరిత రాజకీయాలు చేస్తున్నారు" అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పదే పదే గౌరవ్ మరియు ఆయన కుటుంబానికి పాకిస్థాన్తో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారని, ఇలాంటి పాత అంశాల గురించి మాట్లాడకుండా, రానున్న అయిదేళ్లలో అస్సాం అభివృద్ధి ప్రణాళిక గురించి చర్చించాలని సూచించారు.
ఇదే సమయంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై 2018లో నమోదైన పరువు నష్టం కేసును ప్రస్తావిస్తూ ప్రియాంక మాట్లాడుతూ, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అత్యధిక కేసులు ఎదుర్కోవడం గౌరవ చిహ్నంగా మారిందని అన్నారు. సత్యం, అభివృద్ధి, ప్రజల పక్షాన నిలబడేవారు ప్రభుత్వం నుంచి తప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారని, రాహుల్ గాంధీ కేసులు దీనికి స్పష్టమైన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. అస్సాం ఎన్నికల నేపథ్యంలో ప్రియాంకా ఈ వ్యాఖ్యలు రాజకీయ చర్చను మరింత రాజేస్తున్నాయి.