Supreme Court: సహజీవనంలో (లైవ్-ఇన్ రిలేషన్‌షిప్) ఉండే మహిళలపై జరిగే గృహ హింస, వరకట్న వేధింపులకు కూడా భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 498ఏ వర్తిస్తుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది.

వివాహం చేసుకోకపోయినా, పెళ్లి లాంటి బంధంతో కలిసి జీవిస్తున్న మహిళలపై జరిగే హింస కూడా తీవ్రమైనదేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గృహ హింస నుంచి రక్షణ కల్పించడంలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్న మహిళకు, సహజీవనం చేస్తూ వివాహం తరహా సంబంధంలో ఉన్న మహిళకు మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపడం సరికాదని అభిప్రాయపడింది.

ఇలా తేడా చూపడం రాజ్యాంగ విరుద్ధమని, అంతేకాకుండా దేశంలోని ప్రతి వ్యక్తికి చట్టం సమాన రక్షణ కల్పిస్తుందన్న ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలు వివాహ స్థితిని బట్టి కాకుండా, వాస్తవ పరిస్థితులను బట్టి అమలు కావాలని న్యాయస్థానం సూచించింది.

అయితే ఈ తీర్పు అన్ని రకాల సహజీవన సంబంధాలకు వర్తించదని స్పష్టం చేసింది. వివాహం చేసుకునే ఉద్దేశంతో కలిసి ఉండే వారికి మాత్రమే సెక్షన్ 498ఏ రక్షణ వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది. అంటే పెళ్లి తరహా సంబంధంగా పరిగణించబడే సహజీవనాలకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది.

ఈ తీర్పు మహిళల హక్కుల పరిరక్షణలో మరో ముఖ్యమైన ముందడుగుగా చూడవచ్చు. సహజీవనంలో ఉన్న మహిళలు కూడా ఇకపై గృహ హింస, వరకట్న వేధింపుల నుంచి చట్టపరమైన రక్షణ పొందగలరని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags: