హానీమూన్ మర్డర్ ఎపిసోడ్ లో అనుమానాలెన్నో..

Update: 2025-06-09 12:19 GMT
  • భర్తను భార్యే చంపిందంటున్న పోలీసులు
  • భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు
  • భార్య సోనమ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఏం జరిగిందో తెలీక సతమతమవుతున్నఇరు కుటుంబాలు
  • కోడలు మంచిదేనంటున్న అత్త, బంధుగణం
  • ఆమె దోషయితే ఉరి తీయాలని డిమాండ్
  • సోనమ్ పాత్ర ఖచ్చితంగా ఉందంటున్న పోలీసులు
  • బోయ్ ఫ్రెండ్ రాజ్ కుశవహతో సహా ముగ్గురు అదుపులోకి
  • ధాబా దగ్గర సోనమ్ ఆడినదంతా నాటకమేనన్న పోలీసులు
  • త్వరలోనే మరిన్ని ఆధారాలు బయటకు వచ్చే ఛాన్స్


పెళ్లయి పట్టుమని నెల్లాళ్లు కాలేదు.. నవ్వుతూ, తుళ్లుతూన్న కొత్త జంట హానీమూన్ కని వెళ్లి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకి పెళ్లికొడుకు మృతదేహం కనిపించింది. మరికొన్ని రోజులకు ఒక ధాబా దగ్గర పెళ్లి కుమార్తె కనిపించింది. ఏం జరిగి ఉంటుంది? పోలీసులు మాత్రం పెళ్లి కుమార్తె బోయ్ ఫ్రెండ్ కోసం హత్య చేసిందని ఆరోపిస్తున్నారు..

అనుక్షణం అనుమానాస్పదం

మేఘాలయలో హానీమూన్ కు వెళ్లిన జంటలో భర్త అనుమానాస్పద హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది. భార్యే భర్తను చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మేఘాలయకు చెందిన రాజా రఘువంశి అనే 29 ఏళ్ల యువకుడు,భార్య సోనమ్ తో కలసి మే 23న హానీమూన్ కు వెళ్లాడు. అయితే అప్పటినుంచి వీరి జంట కనిపించకుండా పోయింది.వారం రోజుల వెతుకులాట తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గర రాజా రఘువంశ్ మృతదేహం దొరికింది.మరో వారం తర్వాత రఘువంశి భార్య సోనమ్ ఉత్తర ప్రదేశ్ లోని ఘాజీపూర్ లో ప్రత్యక్షమైంది.అయితే వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.సోనమ్ తన బోయ్ ఫ్రెండ్ రాజ్ కుశవహాతో కలసి ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో బయటపడిందని పోలీసులు చెబుతున్నారు. రాజా కుశవహ గురించి సోషల్ మీడియాలో పెద్దగా సమాచారం లేకపోవడంతో పోలీసులు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.

సోనమ్ దగ్గర ఉద్యోగి!

అయితే కుశవహ సోనమ్ దగ్గర ఉద్యోగి అని వారు రోజు గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారని మృతుని సోదరుడు విపుల్ రఘు వంశి చెబుతున్నారు. సోనమ్ పై అనుమానాలు లేవని, హత్యలో రాజ్ కుశవహ ప్రమేయం ఉన్న పక్షంలో సోనమ్ పాత్ర కూడా ఉండి ఉండొచ్చని అంటున్నారు.

ప్లాన్ ఎందుకు మారింది?

వాస్తవానికి ఈ రాజా రఘువంశ్, సోనమ్ ఒరిస్సాలోని కామాఖ్య ఆలయానికి వెళదామనుకున్నారని, కానీ హటాత్తుగా ప్లాన్ మారి మేఘాలయకు వెళ్లడంపై అనుమానాలున్నాయన్నారు కుటుంబ సభ్యులు.ఈ మార్పు ఇద్దరిలో ఎవరు చేశారో తెలియని, వారు ఈ జర్నినుంచి రిటర్న్ టిక్కెట్లు కూడా బుక్ చేసుకోలేదని రాజారఘువంశి సోదరుడు తెలిపారు. రాజా రఘువంశిని మాత్రమే హత్య చేసి సోనమ్ ను వదిలేశారంటే హంతకులెవరైఉంటారన్నది అనుమానాస్పదంగా ఉందని మృతుని మరో సోదరుడు సచిన్ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అంతా నెల్లాళ్ల లోపే!!

రాజా రఘువంశి, సోనమ్ లకు మే 11న పెళ్లి అయ్యింది.మే 20న వారు హనీమూన్ కు వెళ్లారు.ఒకరోజు తర్వాత ఆ జంట షిల్లాంగ్ లో కనిపించింది. మే 23 నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు.జూన్ రెండున కత్తిపోట్లతో కూడిన రాజా రఘువంశి మృతదేహం పోలీసులకు కనిపించింది. అప్పటినుంచి సోనమ్ జాడ లేదు. ఏమై ఉంటుందన్న అనుమానంతో పోలీసులు సెర్చ్ కొనసాగిస్తుండగానే జూన్ 8న సోనమ్ యూపీలోని ఘాజీపూర్ చేరుకుని తన సోదరుడికి ఫోన్ చేసింది. సోనమ్ రాకను పసిగట్టిన పోలీసులు క్షణాల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.నంద్ గంజ్ దాబా దగ్గర జ్వరంతో ఉండగా సోనమ్ ను అదుపులోకి తీసుకున్నామని యూపీ పోలీసులు చెబుతుంటే మేఘలయ పోలీసులు మాత్రం ఆమె స్వచ్ఛందంగా లొంగిపోయిందని చెబుతున్నారు.

తమ కుమార్తె భర్తను చంపేంత దారుణానికి ఒడిగట్టదని, ఇద్దరి మధ్య గొడవలు లేవని ఆమె దాబా దగ్గర ఉండగానే పోలీసులు తీసుకుపోయారని సోనమ్ తండ్రి చెబుతున్నారు. పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని అసలు ఏంజరిగిందో సీబీఐ ఎంక్వయిరీ చేయాలని ఇరుకుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

పెళ్లిలో ఇద్దరూ సంతోషంగా కనిపించారని, గొడవలు జరిగే ఆస్కారమే లేదని మృతుని సోదరుడు కూడా అంటున్నారు.పోస్ట్ మార్టం రిపోర్టు కూడా తమకు ఇవ్వలేదని అసలేం జరిగిందో తెలీటం లేదని మృతుని సోదరుడు అంటున్నారు. మేఘాలయ పోలీసులపై నమ్మకం లేదని మధ్యప్రదేశ్ పోలీసులు, సిబిఐ కల్పించుకుని దర్యాప్తు చేయాలని ఇరు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

అనుమానాలు లేవుః మృతుని తల్లి

సోనమ్ మంచి పిల్లేనని అత్త ఉమారఘువంశి అంటున్నారు. మంచి ప్రవర్తన కలిగిన పిల్లేననిపిస్తోందని తమకు అనుమానం రావడం లేదని, నిజంగా ఆమె హత్యకు కారణమైతే ఉరి తీసినా తప్పులేదని మృతుని తల్లి అంటోంది.

సిమ్లా పోలీసులేమంటున్నారు?

హానీమూన్ జంట షిల్లాంగ్ లో మూడు రోజులున్నారని, ఆ సమయంలోనే గెస్ట్ హౌస్ మార్చి స్థానికంగా ఒక స్కూటర్ అద్దెకు తీసుకుని ఇద్దరూ తిరగడానికి వెళ్లారని, ఆ తర్వాత మూడు రోజులకు అదృశ్యమయినట్లు వార్తలు వచ్చాయని సిమ్లా పోలీసులు అంటున్నారు. వెంటనే ఆ ప్రాంతాన్ని స్థానిక పోలీసులు గాలించగా హనీమూన్ జంటతో పాటు, మరో ముగ్గురు అనుమానాస్పందగా కొండ దిగుతూ కనిపించారన్నారు. అప్పటికి రాజా బతికే ఉన్నాడని, షిల్లాంగ్ లో అద్దెకు తీసుకున్న స్కూటర్ అదృశ్యమైందని అన్నారు. ఇలా దిగుతున్న జంటను పోలీసులు ఓ కంట కనిపెట్టారని, అప్పటినుంచి మళ్లీ ఆ జంట అదృశ్యమైందన్నారు. రెండు రోజుల తర్వాత ఈస్ట్ కాశీ వాటర్ ఫాల్స్ దగ్గర రాజా రఘువంశ్ డెడ్ బాడీ కత్తిపోట్లతో కనిపించిందన్నారు. అప్పటినుంచి కనిపించకుండా పోయిన సోనమ్ మళ్లీ యూపీలో ప్రత్యక్షమైందని ఆమెను క్లోజ్ గా ఫాలో అయిన పోలీసులు ఆమె బోయ్ ఫ్రెండ్ రాజ్ కుశ్ వహ ప్రమేయం ఉందనడానికి ఆధారాలు సంపాదించారని, ఇందులో సోనమ్ పాత్ర ఖచ్చితంగా ఉందని త్వరలోనే బయట పెడతామంటున్నారు.

ధాబా ఓనర్ ఏమంటున్నారు?

తమకు సోనమ్ నలిగిన దుస్తులతో చెదిరిన తలతో ఏడుస్తూ కనిపించిందని, తన మొబైల్ పోయిందని, హనీమూన్ కు వెళితే దుండగులు వెంటపడి తన నగలను కాజేసేందుకు ప్రయత్నించగా తన భర్త అడ్డుకోబోయి కత్తి పోట్లకు బలయ్యాడని చెబుతోంది. యూపీకి ఎలా చేరుకున్నానో తెలీదంటూ ఏడ్చిందని,ఫోన్ చేసుకుంటానని కోరితే ఫోన్ ఇచ్చానని ఆమె బిగ్గరగా ఏడుస్తూ కుటుంబానికి ఫోన్ చేసిందని ఆ వెంటనే పోలీసులకు సమాచార మివ్వగా వారొచ్చి అరెస్టు చేశారని చెబుతున్నారు.

ముగ్గురిని అరెస్టు చేశాం!!

అయితే సోనమ్ కట్టు కథలు చెబుతోందని ఆమెకు బోయ్ ఫ్రెండ్ రాజ్ సింగ్ కుశవహతో పెళ్లికి ముందు సంబంధాలున్నాయని, అతగాడితో పాటు ఇండోర్ కు చెదిన విశాల్ సింగ్ చౌహాన్,లలిత్ పూర్ కు చెందిన ఆకాశ్ రాజ్ పుత్ లను అదుపులోకి తీసుకున్నామని త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతామని అంటున్నారు.

Tags:    

Similar News