SupremeCourt: సుప్రీంకోర్టు హై-సెక్యూరిటీ జోన్లో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీపై నిషేధం.. కారణం ఏమిటి?
కారణం ఏమిటి?
SupremeCourt: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై-సెక్యూరిటీ జోన్లో వీడియోగ్రఫీ మరియు ఫొటోగ్రఫీని పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం 2025 సెప్టెంబర్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, ప్రతిరోజూ ఆవరణలో సందర్శకులైన ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, హై-సెక్యూరిటీ జోన్లో ఎవరూ మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీయడానికి లేదా వీడియోలు రికార్డ్ చేయడానికి అనుమతించబడరు. అలాగే, ఈ జోన్లో కెమెరాలు, ట్రైపాడ్లు, సెల్ఫీ స్టిక్ల వినియోగం కూడా నిషేధించబడింది. లో-సెక్యూరిటీ జోన్లో మాత్రమే జర్నలిస్టులు ఇంటర్వ్యూలు లేదా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం తెలిపింది.
ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మీడియా సిబ్బంది ఈ రూల్స్ను అతిక్రమిస్తే, ఒక నెల వరకు హై-సెక్యూరిటీ జోన్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సిబ్బంది మరియు ఇతర విభాగాల ఉద్యోగులు కూడా కఠిన నిఘాకు గురవుతారని, వారు నిబంధనలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.