Woman Civil Services Officer: అస్సాంకు చెందిన సివిల్‌ సర్వీస్‌ అధికారిణి నుపుర్‌ బోరాను పోలీసులు అరెస్టు చేశారు. భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ఆమె నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా, భారీ ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్‌ సెల్‌లో పనిచేస్తున్న నుపుర్‌ బోరాపై బార్పేట్‌ జిల్లాలో సర్కిల్‌ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు లంచం రూపంలో డబ్బు, భూమి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచిన అధికారులు, సోమవారం ఆమె ఇంటితో సహా మూడు చోట్ల సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.90 లక్షల నగదు, రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. నుపుర్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

విజిలెన్స్‌ ఎస్పీ రోజీ కలిత మాట్లాడుతూ, ఈ కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతుందని, నుపుర్‌పై మరిన్ని అవినీతి ఆరోపణలు బయటపడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, నుపుర్‌కు సహాయకుడిగా పనిచేసిన లాట్‌ మండల్‌ సురాజిత్‌ డేకా నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఇతడిపై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.