శత్రు దేశానికి యూట్యూబర్ల సహకారం?
యూట్యూబ్ సెలబ్రిటీగా గుర్తింపు పొందిన బయ్యా సన్నీ యాదవ్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రపంచాన్ని బైక్ మీద చుట్టేస్తూ తన యాత్రలను వీడియోలుగా రూపొందించి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా సన్నీ భారీ ఫాలోయింగ్ను సంపాదించాడు. అయితే ఇటీవల బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశాడన్న కారణంగా అతనిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పోలీసులకు కనిపించకుండా మాయమయ్యాడు. కానీ, ఇటీవలే అరెస్టయ్యాడు. అయితే సన్నీ యాదవ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
'ఆపరేషన్ సింధూర్' సమయంలో సన్నీ పాకిస్తాన్లో ఉన్నట్టు సమాచారం. దుబాయ్లో ఉన్నప్పుడు అతనిపై లుక్అవుట్ నోటీసులు జారీ కాగా, అక్కడి నుంచి నేరుగా పాకిస్తాన్కి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సన్నీ ఐదు సార్లు పాకిస్తాన్కి వెళ్లినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయిన సమయంలో పాకిస్తాన్లో అతను ఎందుకు ఉన్నాడనే ప్రశ్నలు పోలీసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దేశానికి సంకట పరిస్థితుల్లో శత్రు దేశంలో తలదాచుకోవడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సందర్భంలో ఆమెతో సన్నీకి ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై కూడా విచారణ సాగుతోంది. యూట్యూబర్లు ఒక్కొక్కరుగా వివాదాల్లో మునగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొన్నటికి మొన్న జ్యోతి మల్హోత్రా, ఇప్పుడు సన్నీయాదవ్.. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు కావడం కలకలం సృష్టిస్తోంది. నెటిజన్లకు మైండ్ బ్లాంకయిపోతోంది. మొదట్లో కేవలం బెట్టింగ్ స్కామ్కి మాత్రమే సంబంధం ఉన్నట్టు అనిపించిన సన్నీయాదవ్ కేసు, ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన అంశాల వరకు విస్తరించడంతో తీవ్ర చర్చకు దారి తీసింది.
రీసెంట్గా విశాఖపట్నంలో స్లీపర్ సెల్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సన్నీ యాదవ్ కూడా అలాంటి నెట్వర్క్లో భాగమా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయంటున్నారు పోలీసులు. పోలీసుల దర్యాప్తు మరింత లోతుగా సాగుతున్న వేళ, ఇతనిపై ఉన్న అనుమానాలన్నింటికీ సమాధానాలు త్వరలో రానున్నాయని భావిస్తున్నారు.