Bangladesh Cricketer Accused of Sexual Assault: బంగ్లాదేశ్ క్రికెటర్పై లైంగిక దాడి ఆరోపణలు
లైంగిక దాడి ఆరోపణలు
Bangladesh Cricketer Accused of Sexual Assault: బంగ్లాదేశ్లో ఒక యువ క్రికెటర్పై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. బంగ్లాదేశ్ 'ఏ' జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేస్-బౌలింగ్ ఆల్రౌండర్ టోఫెల్ అహ్మద్ రైహాన్పై పోలీసులు తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాలు లభించాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, 2025 జనవరిలో ఫేస్బుక్ ద్వారా టోఫెల్ అహ్మద్ రైహాన్తో పరిచయం ఏర్పడింది. తమ మధ్య సంభాషణ ప్రేమ సంబంధంగా మారిన తర్వాత, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని యువతి పేర్కొంది. జనవరి 31న గుల్షన్ ప్రాంతంలోని ఒక హోటల్కు తీసుకెళ్లి, సిబ్బందికి తన భార్యగా పరిచయం చేసి, తన అనుమతి లేకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ఈ సంఘటన తర్వాత కూడా పలుమార్లు దాడి చేసి, పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఆరోపణలపై బాధితురాలు ఆగస్టు 1న గుల్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా, బాధితురాలి వాంగ్మూలం, హోటల్ రూమ్ బుకింగ్ వివరాలు, మెడికల్ పరీక్షల నివేదికలు, ఇద్దరి మధ్య జరిగిన సోషల్ మీడియా చాట్లతో సహా కీలక సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. ఈ ఆధారాలన్నీ ఆరోపణలకు మద్దతుగా ఉన్నాయని నిర్ధారించిన గుల్షన్ పోలీసులు, మహిళలు, పిల్లలపై అణచివేత నిరోధక చట్టం సెక్షన్ 9(1) కింద టోఫెల్పై అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో నిందితుడు టోఫెల్ అహ్మద్ రైహాన్కు సెప్టెంబర్ 24న హైకోర్టు ఆరు వారాల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు ముగిసిన తర్వాత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించినప్పటికీ, అతను ఆ ఆదేశాన్ని పాటించకుండా బంగ్లాదేశ్ 'ఏ' జట్టు తరపున హాంకాంగ్లో జరిగిన ఆరు పక్కల క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ నిమిత్తం డిసెంబర్ 30న కోర్టు ముందు ప్రవేశపెట్టబడుతుంది.