Big Shock for Delhi Capitals: భారత క్రికెట్, ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు సంబంధించిన ఒక సంచలన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్, స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టులో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే, రాజస్థాన్ రాయల్స్ చివరి నిమిషంలో చేసిన భారీ డిమాండ్ కారణంగా ఈ మెగా డీల్ రద్దయింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీలో కీలక సభ్యుడైన ఒక ఉన్నతాధికారి ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సమాచారం. సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా తమ జట్టులోకి తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ డీల్ దాదాపు ఖరారైన సమయంలోనే, రాజస్థాన్ రాయల్స్ ఒక భారీ డిమాండ్ ముందుకు తెచ్చింది.

సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా ఢిల్లీకి ఇస్తే, ప్రతిగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని భారత టాప్ ఆర్డర్ స్టార్ బ్యాటర్ ఒకరిని తమకు అప్పగించడంతో పాటు, అదనంగా భారీ మొత్తంలో నగదు చెల్లించాలని RR కోరినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఆ స్టార్ బ్యాటర్‌ను వదులుకోవడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడం, అలాగే అదనపు నగదు డిమాండ్‌తో ఏకీభవించకపోవడంతో ఈ ట్రేడింగ్ ఒప్పందం రద్దయినట్లు సదరు అధికారి తెలిపారు.

సంజూ శాంసన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాత అనుబంధం ఉంది. ఆయన ఐపీఎల్‌లో 2016, 2017 సీజన్‌లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఆడాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో మళ్లీ ఢిల్లీకి రావడానికి సంజూ శాంసన్ కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం.

Tags: