భర్త అనిల్ తో కలసి కేసీఆర్ ని కలసిన ఎమ్మెల్సీ కవిత
పార్టీ వ్యవహారాలపై రాసిన లేఖ వెలుగు చూసిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదటి సారిగా బుధవారం ఉదయం మాజీ సీంయ తన తండ్రి అయిన కేసీఆర్ని కలిశారు. మరికొద్ది సేపట్లో కాళేశ్వరంపై వేసిన పీసీఘోష్ కమీషన్ ముందు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో బుధవారం ఉదయం భర్త అనిల్ తో కలసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలసి తన సాలిడారిటీని తెలియజేశారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీలో అగ్ర నేతల మధ్య ఉన్న అంతర్గత విభేధాలు మీడియాలో ప్రధాన వార్తలుగా వస్తున్నాయి, అందకు తగ్గట్లుగానే కవిత తన అసంతృప్తిని తండ్రికి లేఖ రాయడం ద్వారా వెళ్ళగక్కారు. అయితే కవిత అమెరికా పర్యటనలో ఉండగా ఆ లేఖ మీడియా ద్వారా వెలుగు చూడటంతో రాష్ట్రంలో హల్ చల్ అయ్యింది. కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆ లేఖ తానే రాసానని స్పష్టత ఇవ్వడంతో పాటు కేసీఆర్ మంచోడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చేసిన వ్యాఖ్య పార్టీలో పరిస్ధితిని మరింత తీవ్రం చేసింది. అన్న కేటీఆర్ని టార్గెట్ గా చేసుకుని కవిత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా జరిగింది. ఇదే సమయంలో కవిత జాగృతి సంస్ధను యాక్టీవ్ చేసి సింగరేణిలో కార్మిక సంఘాన్ని కూడా ప్రారంభించారు. అలాగే జాగృతి ప్రధాన కార్యాలయాన్ని కూడా అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పరిస్ధితుల నడుమ కవితకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేస్తుందని, క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు కవితను సస్పెడ్ చేస్తారని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం భర్త సమేతంగా కవిత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.