Terrifying African Snails Invade Hyderabad: భాగ్యనగరంలో భయానక ఆఫ్రికన్ నత్తలు: పచ్చటి తోటలు, మొక్కలపై దాడి.. అధికారులు అప్రమత్తం

అధికారులు అప్రమత్తం

Update: 2025-11-06 08:36 GMT

Terrifying African Snails Invade Hyderabad: హైదరాబాద్‌లో ఆఫ్రికా నుంచి వచ్చిన భయంకర నత్తలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా చేరాయో తెలియని ఈ ఆక్రమణకారులు పచ్చని చెట్లు, మొక్కలను మేసేస్తూ ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని న్యూబోయిన్‌పల్లిలో మిలిటరీకి చెందిన మూడు ఎకరాల విస్తీర్ణంలోని ఆకుపచ్చ వనంలో ఈ నత్తలు కనిపించడంతో స్థానికులు భయంతో ఉన్నారు. ఆకులు, చిగుళ్లు, కాండాలు, పూతపిందెలతో పాటు మొత్తం వృక్షాలను నేలకొరిగేలా చేస్తున్న ఈ చీడలు, హైదరాబాద్ అంతా వ్యాప్తి చెందితే కొద్దిపాటి పార్కులు, ఇళ్ల మొక్కలు మిగలవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందే మేల్కొని చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ ఆఫ్రికన్ నత్తలు కేరళలో ఎక్కువగా కనిపిస్తాయి. వాటి జీవితకాలం ఐదు నుంచి ఆరు సంవత్సరాలు. ఒక్కో నత్త నెలకు వందలాది గుడ్లు పెట్టి, వేగంగా సంతానోత్పత్తి చేస్తాయి. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ నత్తలు రైతులకు తలనొప్పి కలిగించాయి. బొప్పాయి, ఆయిల్‌పామ్, మిరపకాయలు తదితర పంటలను పూర్తిగా నాశనం చేసి, కర్షకులను కష్టాలకు గురిచేశాయి. నిపుణుల సలహాలతో ఉప్పు ద్రావణం, కాపర్ సల్ఫేట్, స్నెయిల్ కిల్లర్ మందులను చల్లి అదుపులోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి సమస్య వచ్చినట్లు తెలుస్తోంది.

తేమ ఎక్కువగా ఉంటే ఈ నత్తలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఆఫ్రికా నుంచి ఓడల ద్వారా ఈ చీడలు వచ్చి ఉండవచ్చని నిపుణులు అంచనా. పురుగుమందులతో సులభంగా నివారించవచ్చు, కానీ పర్యావరణానికి ముప్పుగా మారతాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే వాటి సంఖ్య తగ్గుతుందని ఓయూ జంతుశాస్త్ర విభాగాధిపతి రెడ్యానాయక్ తెలిపారు. "వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే ఇవి వృద్ధి చెందుతాయి. పురుగుమందుల ద్వారా నివారించవచ్చు. కానీ పర్యావరణానికి ముప్పు" అని ఆయన వివరించారు.

న్యూబోయిన్‌పల్లిలోని ఏ1 మిలిటరీ స్థలంలో పెరిగిన ఈ నత్తల నివారణకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టనున్నారు. "ఆ ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాక ఉప్పు ద్రావణాన్ని చల్లిస్తాం. వెంటనే చర్యలు చేపడతాం" అని బోయిన్‌పల్లి సర్కిల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ అశుతోష్ చౌహాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, ప్రజలు ఈ నత్తలను చూస్తే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఆకుపచ్చ ప్రదేశాలు, పార్కులు ఈ ముప్పుకు గురికాకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కోరారు.

Tags:    

Similar News