Russia Ukraine war : రష్యా, ఉక్రెయిన్ యుద్దం ముగింపుకు కీలక అడుగు
వైట్హౌస్లో జెలెన్స్కీతో భేటీ అయిన ట్రంప్, యూరోపియన్ యూనియన్ దేశాధ్యక్షులు;
గడచిన నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ ముంగింపుకు కీలక అడుగు పడింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల అధ్యక్షుల సమావేశం ఈ దిశగా కీలక చర్చలు జరిపింది. ఈ భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ తాము దీర్ఘకాలిక శాంతి కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్చల ముగింపు దశలో తాను రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడినట్లు, జెలెన్స్కీ, పుతిన్ల మధ్య భేటీ ఏర్పాట్లకు బీజం పడిందని ట్రంప్ తెలిపారు. అయితే వీరి భేటీ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియా, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ల నేతృత్వంలో రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సమావేశం జరుగుతుందని ట్రంప్ ప్రకటించారు. వీరి సమావేశం ముగిసిన తరువాత తాను వారితో భేటీ అవుతానని ట్రంప్ తెలిపారు. మరోపక్క ట్రంప్తో సమావేశం ముగిసిన తరువాత జెలెన్స్కీ కూడా సంతోషం వ్యక్తం చేశారు. చాలా నిర్మాణాత్మకంగా, ఆశాజనకంగా సమావేశం జరిగిందని జెలెన్స్కీ వెల్లడించారు. ప్రధానంగా ఉక్రెయిన్ భద్రత, హామీలతో పాటు అనేక సున్నిత విషయాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు జెలెన్స్కీ చెప్పారు. రష్యా, అమెరికా, ఉక్రెయిన్ దేశాల త్రైపాక్షిక భేటీకి తాము సిద్దమేనంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. వైట్హస్లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జర్మనీ ఛాన్సిలర్ ఫెడ్రిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ యూకే ప్రధాని కీర్ స్టార్మర్, యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉర్సులా వాండెర్లెయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెలు పాల్గొన్నారు.