భారత సంస్కృతిలో మునిగి తేలుతున్నా – మిస్ మాల్టా
మిస్ వరల్డ్ పోటీల కారణంగా అద్భుతమైన భారతీయ సంస్కృతిలో మునిగి తేలుతున్నానని మిస్ మాల్టా మార్టిన్ కుటాజార్ చెప్పారు. హైదరాబాద్లో తన అనుభవాలను పొలిటెంట్ మీడియాతో షేర్ చేసుకున్నారు. తన జీవితంలో ఇంత దూరం వచ్చిన మొదటి ప్రయాణం ఇదేనన్నారు మార్టిన్.
మాల్టాలో భారతీయ కమ్యూనిటీ చాలా బలంగా ఉందని, అక్కడ రాజస్థాన్ డే ఉత్సవాల్లో తాను పాల్గొన్నానని, సంప్రదాయ వస్త్రధారణ, భారతీయ వంటలు అప్పుడే రుచి చూశానన్నారు. అయితే, ఇప్పుడు పూర్తిగా ఈ సంస్కృతిలో మునిగి తేలడం అనేది తనకు ఒక అందమైన అనుభవం అని చెప్పారు.
హైదరాబాద్లో చాలా ఉత్సాహంగా ఉంటోందని, ఇక్కడి డిజైనర్ల చీరలు, వస్త్రాలు ధరించడంలో ప్రతి రోజు కొత్త అనుభూతి కలుగుతోందన్నారు. ఫొటోషూట్లు, కల్చరల్ ప్రోగ్రామ్లతో నిర్వాహకులు తమను బిజీగా ఉంచుతున్నారని వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లేలోగా.. ఇక్కడి విభిన్న వర్గాల వాళ్లతో మాట్లాడాలని ఉందని, వాళ్ల జీవితాలను దగ్గరగా తెలుసుకోవాలనుకుంటున్నానని, అలాగే, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన మిగతా అందాల భామలతో మమేకమవుతూ.. తన సొంత ప్రాజెక్ట్ బ్యూటీ విత్ పర్పస్ గురించి ప్రచారం చేయాలని ఉందన్నారు మిస్ మాల్టా మార్టిన్ కుటాజార్.