వీర్యదానం ద్వారా పుట్టిన 100 మందికి నా ఆస్తులు - వీలునామా రాశానన్న టెలిగ్రామ్ సీఈఓ
My assets to 100 people born through my sperm donation - Telegram CEO says he wrote a will;
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ మరోసారి సంచలన ప్రకటనతో ప్రపంచదేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. గతంలోనే తన వీర్యదానంతో 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్ తండ్రినని వెల్లడించిన ఆయన, ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తన వీర్యదానంతో జన్మించిన వాళ్లందరికీ తన సంపదను పంచేస్తానని ప్రకటించి దురోవ్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారారు.
ఇటీవల ఓ అంతర్జాతీయ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పావెల్ మాట్లాడుతూ తన వీలునామాలో ఈ పిల్లల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నట్టు చెప్పారు. తనకు సహజంగా జన్మించిన పిల్లలతో పాటు వీర్యదానం ద్వారా పుట్టిన పిల్లలందరికీ సమానమైన హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. తనకున్న సుమారు 20 బిలియన్ డాలర్ల ఆస్తిని వాళ్లందరికీ సమానంగా పంచుతానని వెల్లడించారు. అయితే, ఈ హక్కును వాళ్లు 30 ఏళ్ల వయసు వచ్చేదాకా పొందలేరని, అప్పటివరకూ వారు స్వతంత్రంగా, బాధ్యతతో ఎదగాలనే ఆశయం తనదన్నారు.
గతేడాది జూలైలో పావెల్ ఒక పోస్ట్ ద్వారా తన వీర్యదానానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడి అభ్యర్థనపై మొదలైన ఈ ప్రక్రియలో ఆయన 12 దేశాల్లోని వందల కుటుంబాలకు పిల్లల్ని కలిగించే అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వీర్యదానం చేయడం ఆపినప్పటికీ, ఫ్రీజ్ చేసిన తన స్పెర్మ్ ద్వారా ఇంకా కొన్ని కుటుంబాలు సంతానాన్ని పొందుతున్నాయని తెలుసుకున్నట్లు చెప్పారు.
తాను ఇప్పటికీ వివాహం చేసుకోలేదని, అయితే ముగ్గురు సహజీవన భాగస్వాములుండగా వారికి ఆరుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. తన జీవితం ఎన్నో సవాళ్ల మధ్య సాగుతుందని, శత్రువులు కూడా ఎక్కువగానే ఉన్నారని పావెల్ వ్యాఖ్యానించారు. అందుకే, కేవలం 40 ఏళ్ల వయస్సులోనే వారసత్వ హక్కుల్ని స్పష్టంగా పేర్కొంటూ వీలునామా రాసినట్లు వివరించారు.
ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వ్యక్తిగతంగా పెళ్లికి దూరంగా ఉన్నా, కుటుంబాలకోసం అరుదైన మార్గం ఎంచుకున్న దురోవ్ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.