భారతీయ వంటలు నేర్చుకోవాలని ఉంది - మిస్ జర్మనీ
ఇండియన్ వంటకాలు నేర్చుకోవాలని ఉందని, ఇక్కడి వెరైటీలు తనను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని మిస్ జర్మనీ సిల్వియా దొరే సంచెజ్ చెప్పింది. తనకు పాలక్ పనీర్ ఇష్టమైన వంటకం అని చెప్పిన సిల్వియా.. జర్మనీలో అవకాశం దొరికితే వంటలు నేర్చుకుంటానంది.
మిస్ వరల్డ్ పోటీ కోసం హైదరాబాద్కు వచ్చిన మిస్ జర్మనీ సిల్వియా దొరే సంచెజ్, భారత సాంప్రదాయాలను ప్రశంసించారు. తాను రెండోసారి భారత్కు వచ్చానని, గత మార్చిలో తన సోదరితో కలిసి రాజస్థాన్లో పర్యటించానని, అక్కడే మొదటిసారిగా చీర కొన్నానని తెలిపింది. పొలిటెంట్ మీడియాకు ఆమె మిగతా అందాల తారలకు భిన్నంగా చీర కట్టులో ఇంటర్వ్యూ ఇచ్చారు.
హైదరాబాద్లోని దేవాలయాల సందర్శనలో భాగంగా ఐదు నిమిషాల్లోనే చీర కట్టుకున్నానని, ఎవరి సహాయం లేకుండా తానే చీర ధరించానని, గతంలో ఇండియాకు వచ్చినప్పుడు నేర్చుకున్న అనుభవం ఇప్పుడు పనికొచ్చిందని చెప్పింది. భారతీయ దుస్తులు, ఆభరణాలు అంటే ఎంతో ఇష్టమని, ప్రత్యేకించి జుంకాలు తనకు చాలా ఇష్టమైనవని తెలిపింది. ప్రస్తుతం తన దగ్గర మూడు చీరలు ఉన్నాయని, ఫ్యూచర్లో అన్ని రంగుల చీరలు కొనాలనుకుంటున్నట్లు తన ఆకాంక్షను వెల్లడించింది సిల్వియా. లాడ్ బజార్కి వెళ్లినా జువెల్లరీ మాత్రమే కొనగలిగామని, చీరలు కొనేందుకు సమయం దొరకలేదని చెప్పింది.
ఇక, భారతీయ సంస్కృతి, బాలీవుడ్ సినిమాలపైనా తన ఒపీనియన్ వెల్లడించింది సిల్వియా. భారతీయులు ఎంతో ప్రేమగా, ఆత్మీయంగా ఉంటారని చెప్పింది. మిస్ వరల్డ్ పోటీకి ఎంపిక అయిన తర్వాత భారత్లో ఉండేందుకు కేవలం ఒక నెల సమయం మాత్రమే దొరకడం వల్ల భారతీయుల్ని అంతగా కలుసుకోలేకపోయానని అసంతృప్తి వ్యక్తం చేసింది.