ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం గడచిన రెండు రోజులుగా తాగునీటి కోసం కటకటలాడుతోంది. తాగునీటి సరఫరా విభాగం సమ్మె కారణంగా విశాఖనగరంలో నీటి సరఫరా గత 30 గంటలుగా నిలిచిపోయింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల్లో పదేళ్ళ అనుభవం ఉండి, సాంకేతిక పరమైన విధులు నిర్వహిస్తున్న 900 మందిని సెమీ స్కిల్‌ కేటగిరిలో చేర్చి, ఆ స్ధాయి వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ కు తలొగ్గిన జీవీఎంసీ కౌన్సిల్ గతేడాది డిసెంబర్‌ లో వేతనాల పెంచడానికి ఆమోదం తెలిపింది. అయితే అధికారులు మే నెల నుంచి నెలకు ఆరు వేల రూపాయల చొప్పున పెంచుతూ ఆప్కాస్‌ వెబ్‌ సైట్‌ లో వివరాలు పెట్టారు. అయితే వెబ్‌ సైట్‌ లో అయితే పెట్టారు కానీ ఆచరణలో మాత్రం పాత వేతనాలే చెల్లిస్తున్నారు. తాజాగా జూన్‌ నెల జీతాలు కూడా పాత వేతనాలనే అప్‌లోడ్‌ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు సమ్మెకు దిగారు. వీరి సమ్మె కారణంగా విశాఖ నగరంలో తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులతో శుక్రవారం రాత్రి వరకూ అధికారులు చేసిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. శనివారం మరో సారి వాటర్‌ సప్లై ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు మేయర్‌ తో చర్చలకు వెళ్ళనున్నారు. అయితే చర్చలు సఫలమైతేనే నిటి సరఫరా పునరుద్దరిస్తామని కార్మికులు ఖరాఖండీగా చెపుతున్నారు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని మంచినీటి ట్యాంకులు ఖాళీ అయిపోయాయి. చర్చలు సఫలమైనా ఈ ఖాళీ ట్యాంకులు అన్నింటినీ నింపాలన్నా కనీసం పది గంటల సమయం పడుతుందని చెపుతున్నారు. ఈ పరిస్ధితి నివారించడానికి సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపించాలని జీవీఎంసీ ఆలోచన చేస్తోంది. మంచినీటి సరఫరా వ్యవహారం సచివాలయ ఉద్యోగులకు అప్పచెపితే సాంకేతిక సమ్యలు తలెత్తి పరిస్ధితులు మరింత జఠిలమవుతాయని వాటర్‌ సప్లై ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులతో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా మేనేజ్‌ చేస్తున్నప్పటికీ అనీటి లభ్యత ఏమాత్రం సరిపోక ప్రజలు తాగునీటి కోసం రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

అప్కాస్‌ కార్మికుల సమ్మె కారణంగా గత ముప్పై గంటలుగా విశాఖ నగరంలో మూడు లక్షల ఇంటి కుళాయిలు, ఆసుపత్రులు, అనేక కీలక పరిశ్రమలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. అనేక కాలనీల్లో ప్రజలు నీటి ఎద్దడి తట్టుకోలేక బిందెలు తీసుకుని ఆందోళనలకు దిగుతున్నారు. విశాఖనగరంలో ప్రతిష్టాత్మకమైన హెచ్‌పీసీఎల్‌, కోరమండల్‌, ఎస్సార్‌, ఆర్‌సీఎల్‌, విశాఖపోర్ట్‌ తదితర పరిశ్రమలకు నీటిసరఫరాలో అంతరాయం కలిగింది. గోస్తని, తాటిపూడి, గంభీరం, రైవాడ కెనాల్‌, ఏలేరు రిజర్వాయర్ల నుంచి విశాఖ నగరానికి రావాల్సిన నీటిని వాటర్‌ సప్లై ఉద్యోగులు నిలిపివేశారు. అయితే కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రజలకు ఎటువంటి మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలరి విశాఖ కార్పొరేషన్‌ మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story