నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు మిస్సింగ్

ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పట్నంలో మహిళల మిస్సింగ్ కేసులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. కేవలం 4 నెలల వ్యవధిలోనే 175 మంది యువతులు, మహిళలు కనిపించకుండా పోయారు. వీరిలో ఇప్పటి వరకు 133 మంది ఆచూకీ మాత్రమే దొరికింది. మరో 42 మంది మహిళలు, యువతుల అదృశ్యం ఇంకా మిస్టరీగానే ఉంది. ప్రేమ, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలే మిస్సింగ్లకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. విశాఖ పట్నంలో వరుసగా మహిళలు అదృశ్యం అవుతున్న సంఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్టున్నాయి. దాదాపు ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బాలికల నుంచి వివాహితుల వరకు చాలామంది కనిపించకుండా పోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వాళ్లు.. తిరిగి ఇంటికి చేరుకోక పోవడం ఆందోళన కలిగిస్తోంది. తప్పిపోయిన వాళ్ల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం ఉండటం లేదు. దీంతో, చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు కుటుంబసభ్యులు.
ఇటీవల విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మిస్సింగ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా.. కేవలం నాలుగు నెలల కాలంలోనే 175 మంది బాలికలు, యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మహిళల అదృశ్యానికి ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది. కనిపించకుండా పోయిన యువతుల్లో ఎక్కువ మంది.. ప్రేమలో పడి.. ప్రేమికులను దక్కించుకోవడం కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఇక, మధ్య వయస్కులైన వివాహిత మహిళలు కూడా.. వివాహేతర సంబంధాలు పెట్టుకొని.. ప్రియుడి కోసం భర్తను, పిల్లలను, కుటుంబాన్నే వదిలి వెళ్లిపోతున్నారు. మిస్సింగ్ కేసుల్లో సుమారు 75 శాతం వరకు ఈ రెండు కారణాలే ఉన్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రతి యేటా 50 నుంచి 186 కేసుల దాకా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 175 కేసులు నమోదు కావడం, పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్న చర్చ జరుగుతోంది. జనవరి నెలలో 37 మంది, ఫిబ్రవరిలో 49 మంది, మార్చిలో 43 మంది, ఏప్రిల్లో 46 మంది అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీరిలో 133 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించారు. 42 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నారు. మరోవైపు.. మహిళలు, బాలికల మిస్సింగ్ ఫిర్యాదులు, వాళ్లను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారుతోంది. కొంతమంది ఆచూకీ తెలుసుకున్నప్పటికీ.. మేజర్లు, చట్టాలు, హక్కులు పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇటువంటి కేసుల్లో అదృశ్యమైన వారి ఆచూకీని పోలీసులు గుర్తించడం మినహా.. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో కేసులు త్వరగా పరిష్కారం కావడం లేదు.
