ఈనెల 20వ తేదీన రైతులకు అన్నదాతా..సుఖీభవ

- వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేస్తున్నాం
- సాగులో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం...యంత్రపరికరాలు, డ్రోన్లు అందిస్తున్నాం
- వంగూరులో నాగలితో పొలం దున్ని ఏరువాక ప్రారంభించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఈనెల 20వ తేదీ నుండి రాష్ట్రంలోని రైతులకు అన్నదాతా..సుఖీభవ కార్యక్రమం కింద ఆర్ధిక సహాయం అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. పెదవేగి మండలం వంగూరు గ్రామంలో బుధవారం నాగలితో పొలం దున్ని 'ఏరువాక పూర్ణిమ' కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. రాష్ట్రప్రభుత్వానికి ఆర్ధిక పరిస్థితులు అనుకూలించనప్పటికీ రైతులకు మేలు చేసే కార్యక్రమంలో మాత్రం ఎటువంటి రాజీ పడేదిలేదన్నారు. గత ప్రభుత్వం రైతు సంక్షేమంపై మాటలకే పరిమితమైందని, చేతలలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం రైతులకు బకాయిపడిన 1640 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించామని, రబీ, ఖరీఫ్ సీజన్లో ధాన్యం పండించిన రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ధాన్యం అందించిన 24 గంటలలోగా ధాన్యం సొమ్మును రైతుల ఖాతాలో జమచేసి ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతులకు పచ్చా రొట్టి విత్తనాలు అందిస్తున్నామని, భూసార పరీక్ష ఫలితాలను రైతులకు అందించి సూక్ష్మ పోషకాలు రైతులకు అందిస్తున్నామన్నారు. రైతులకు సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించి, యంత్రపరికరాలను సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. సాగులో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతి వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రసాయనిక ఎరువుల వినియోగం బాగా పెరిగిందని, దానిని పూర్తిగా నివారించడానికి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయం కారణంగా ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు లభించడమేకాక, రైతుకు సాగు ఖర్చు తగ్గుతుందని, పంటలకు అధిక ధర, భూసారం కూడా పెరుగుతుందన్నారు. వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేలా రైతులకు మేలు చేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు.వ్యవసాయంతో పాటు, అనుబంధ రంగాలైన హార్టికల్చర్, ఆక్వా రైతులను కూడా ఆదుకుంటున్నామని, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పధకాలను 50 నుండి 90 శాతం సబ్సిడీతో అందిస్తున్నామన్నారు. ఏలూరు జిల్లాలో కోకో రైతుల సమస్య, గుంటూరు మిర్చి రైతుల సమస్య, చిత్తూరు లో మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నదన్నారు.
కార్యక్రమంలో కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, హార్టికల్చర్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారపాటి రామసీత, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాషా, ఉద్యానవనాలు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి రవికుమార్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, తదితరులు పాల్గొన్నారు.
