కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ని కోరిన సీయం చంద్రబాబు

టొబాకో బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ లో ఉత్పత్తి అయిన పొగాకు కొనుగోళ్ళ కోసం రూ. 150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయాల్‌ ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్ళు, పామాయిల్‌ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గింపు తదితర అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కేంద్రమంత్రికి సీయం తెలిపారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్టసవరణ చేయాలని పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు. అయితే పొగాకు కొనుగోళ్ళ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూ.300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలని సీయం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ని కోరారు. అలాగే ఆయిల్‌ పామ్ దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని సీయం కేంద్ర మంత్రికి సూచించారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్‌ రైతులకు సరైన ధర రావడం లేదని, పామాయిల్‌ రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని సీయం కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం.. కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

ఇక ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం సూచించారు. సీఫుడ్ పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రికి విన్నవించారు. అదేవిధంగా మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు ఏపీ సీయం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు చెప్పారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story