Minister Nara Lokesh: గల్లా జయదేవ్కు ఆంధ్రప్రదేశ్ సర్కారు క్షమాపణ: మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh: అమరరాజా గ్రూప్ సీఎండీ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్షమాపణ చెప్పుతోందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. గత ప్రభుత్వం అమరరాజా సంస్థను వేధింపులకు గురి చేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’లో లోకేశ్ పోస్ట్ చేశారు.
గత నాలుగు దశాబ్దాలుగా అమరరాజా సంస్థ ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద పారిశ్రామిక విజయాల్లో ఒకటిగా నిలిచిందని లోకేశ్ తెలిపారు. ఈ సంస్థ ప్రపంచ స్థాయి ఉత్పాదకతను సృష్టించి, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించింది. చిత్తూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ పేరును దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాటిందన్నారు.
గత ప్రభుత్వం ఈ సంస్థను వేధించకుండా ఉండాల్సిందని, సొంత రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించి వృద్ధి చేయాలని భావించిన పారిశ్రామికవేత్తకు ప్రోత్సాహం అందించాల్సింది కానీ బెదిరింపులు చేయకూడదని లోకేశ్ ఆక్షేపించారు.
ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ సంస్థ తన తదుపరి వృద్ధి కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి వేరే చోటికి వెళ్లాల్సి రావడం ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. తిరిగి నమ్మకాన్ని పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీ పారిశ్రామిక రంగం అమరరాజాకు మళ్లీ స్వాగతం పలుకుతోందని చెప్పారు.
అమరరాజా తన ప్రయాణం ప్రారంభించిన రాష్ట్రంలోనే భవిష్యత్తులో కూడా అతిపెద్ద విజయాలు సాధించబోతోందని, ఆ సంస్థ కోసం ఏపీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

