Another blow to Maoists - Key leaders killed in encounter

మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంట్రల్‌ కమిటీ సభ్యుడితో పాటు.. జోనల్‌ కమిటీ సభ్యురాలు మరో మావోయిస్టు మరణించారు. ఇది మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి సహా కీలక నేతలు ఎదురు కాల్పుల్లో చనిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడు మిల్లి అడవుల్లో కొయ్యల గూడెం, కొండమొదలు, చింతకూలు సమీప ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారు జామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లోముగ్గురు మావోయిస్టులు మరణించారు. సెంట్రల్‌ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌ అలియాస్‌ ఉదయ్‌ అలియాస్‌ బిరుసు, జోనల్‌ కమిటీ సభ్యురాలు, ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ, ఏసీఎం సభ్యురాలు అంజు ఉన్నారు. సంఘటనా స్థలంలో మూడు ఏకే-47 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల గణేష్‌ అలియాస్‌ రవి స్వగ్రామం తెలంగాణ లోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారు. గణేష్‌పై రూ.25లక్షల రివార్డు ఉంది. గణేష్‌ కుటుంబంలో ముగ్గురు మావోయిస్టులుగా కీలక హోదాల్లో పనిచేశారు. గాజర్ల సారయ్య అలియాస్‌ ఆజాద్‌ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. ఆజాద్‌ లవ్వాల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు లొంగిపోయి ప్రస్తుతం జనజీవన స్రవంతిలో జీవిస్తున్నాడు. ప్రస్తుతం ఓ ప్రధాన పార్టీలో ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. గణేష్‌ అలియాస్‌ ఉదయ్‌ ఇప్పుడు మారేడుమిల్లి ఎదురుకాల్పుల్లో మరణించాడు.

ఇక, మావోయిస్టు జోనల్‌ కమిటీ సభ్యురాలు వెంకట రవి లక్ష్మి చైతన్య అలియాస్ అరుణ అలియాస్ రూపీకి ఇప్పుడు 54 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెం ఆమె స్వగ్రామం. ప్రస్తుతం మావోయిస్టు స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యురాలిగా అరుణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అరుణపై రూ.20లక్షల రివార్డ్‌ ఉంది. అరుణ తమ్ముడు అజాత్‌ కొన్నేళ్ల క్రితం పాలసముద్రం ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు చలపతి ఆమె భర్త. అలిపిరిలో చంద్రబాబుపై పేలుళ్ల సంఘటనలో చలపతి కీలక వ్యక్తి. విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి సర్వేశ్వర రావుతో పాటు మరో ఎమ్మెల్యే హత్య ఘటనలో అరుణ నిందితురాలు.

అయితే, ఇప్పుడు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో మరింత మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి.



Politent News Web4

Politent News Web4

Next Story