AP Liquor Transport Case: ఏపీలో వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమ రవాణా కేసులో సిట్‌ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండేళ్లుగా కేసు నడుస్తున్నా ఇంతవరకు ఏమీ కనుగొనలేదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ముందుగా సిట్‌ విచారణ తీరును పరిశీలించి, ఆ తర్వాతే హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

రాజ్‌ కెసిరెడ్డి కేసులో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘రాజ్‌ కెసిరెడ్డి పోలీసు కస్టడీపై నిజంగానే సీరియస్‌గా ఉన్నారా?’’ అని న్యాయస్థానం ప్రశ్నించింది. ముందస్తు బెయిల్‌ పెండింగ్‌లో ఉండగానే ప్రొడక్షన్‌ వారెంట్‌ అడగడం, అప్పటికే కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోయే అవకాశం లేకపోవడం గురించి సుప్రీంకోర్టు ఆక్షేపించింది. కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ కావాలని అడుగుతూ, జడ్జి ప్రొడక్షన్‌ వారెంట్‌ ఇచ్చారని గుర్తు చేసింది. ‘‘పోలీసు కస్టడీకి సిద్ధం కాకుండా జ్యుడిషియల్‌ కస్టడీ ఇవ్వమంటున్నారు.. ఇదేం ప్రవర్తన?’’ అని సుప్రీంకోర్టు మందలించింది. ప్రొడక్షన్‌ వారెంట్‌ అరెస్ట్‌ వారెంట్‌తో సమానమని కూడా పేర్కొంది.

మరోవైపు ఏపీ మద్యం రవాణా కేసులో రాజ్‌ కెసిరెడ్డి, డి.వాసుదేవరెడ్డిలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ ప్రక్రియలో నిబంధనలను సరిగ్గా పాటించలేదనే కారణంతో హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీంతో తదుపరి విచారణను సీజేఐ ధర్మాసనం వాయిదా వేసింది.

ఈ కేసు వైఎస్సార్‌సీపీ పాలనలో మద్యం రవాణా ఒప్పందాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించినది. సిట్‌ ఇప్పటికే కీలక నిందితులపై చర్యలు తీసుకుంటూ వస్తోంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సిట్‌ దర్యాప్తు వేగాన్ని, పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.

Next Story