Cases upon cases against YS Jagan - Bulletproof car seized


ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కూటమి సర్కారు కేసుల మీద కేసులు పెడుతోంది. ఇటీవలే పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు జగన్‌ను ఏ-2 నిందితుడిగా కేసులో చేర్చారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, మంగళవారం నల్లపాడు పోలీసులు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందించారు. పార్టీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ద్వారా నోటీసులు పంపిణీ చేశారు.

అదే సమయంలో, సింగయ్య మృతి ఘటనలో ప్రమాదానికి కారణమైన జగన్ వినియోగించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ ఫార్చ్యూనర్ కారును కూడా పోలీసులు సీజ్‌ చేశారు. ఈ వాహనం జగన్ స్వయంగా తన సొంత డబ్బులతో కొనుగోలు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం అందించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సరిగా పనిచేయకపోవడంతో, తన భద్రత కోసం వ్యక్తిగతంగా కారును సిద్దం చేసుకున్నారు. ఈ వాహనాన్ని వైసీపీ పేరుతో కొనుగోలు చేసి, జగన్‌ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్టు సమాచారం.

జూన్ 18న జగన్‌ పల్నాడు పర్యటనలో రెంటపాళ్ల వద్ద జరిగిన ర్యాలీ సమయంలో, ఆయన కాన్వాయ్‌ హైవే నుంచి సర్వీసు రోడ్డులోకి మళ్లినప్పుడు వైసీపీ శ్రేణులు హడావుడి చేయడంతో సింగయ్య కిందపడినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఆధారాలతో కేసు నమోదైంది. డ్రైవర్ రమణారెడ్డి ఈ కేసులో ఏ1, జగన్ ఏ2, కారుని రిజిస్టర్ చేసిన వ్యక్తి ఏ3గా ఉన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో సీసీటీవీ, డ్రోన్ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

వాస్తవానికి ఈ సంఘటన జరిగిన సమయంలో పోలీసులు కేసు నమోదు చేసి.. సింగయ్య మృతికి జగన్‌ కాన్వాయ్‌లోని కారు కారణం కాదని, వేరే కారు కింద పడి సింగయ్య మరణించాడని తేల్చారు. సాక్షాత్తూ జిల్లా ఎస్పీ కూడా అదే విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. సింగయ్య మరణానికి కారణమైందిగా భావిస్తోన్న ఓ ఫార్చూనర్‌ వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో దృశ్యాలను ఆధారంగా చూపిస్తూ పోలీసులు కేసు శైలిని పూర్తిగా మార్చేశారు. నిందితుల పేర్లను కూడా మార్చేశారు.

ఇక సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా, జగన్‌తో పాటు పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిలపై కూడా కేసులు నమోదయ్యాయి. వీరంతా కేసు రద్దు కోసం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది.

మరోవైపు.. ఇంకో సంఘటనలోనూ పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. ఫిబ్రవరిలో గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించిన ఘటనపై పోలీసులు వైఎస్‌ జగన్‌పై కేసు నమోదు చేశారు. శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జగన్ అక్కడ రాజకీయ ప్రసంగం చేశారని పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలకు కూడా 41ఏ నోటీసులు జారీ చేశారు.వైఎస్ జగన్‌పై కేసుల మీద కేసులు - బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు సీజ్

అటు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహా పలువురు వైసీపీ నాయకులు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఇదిలా ఉండగా, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రభుత్వం‌పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్‌ను ప్రజల్లోకి రాకుండా చేయడానికే అధికార తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సఫారీ వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు ఇప్పుడు జగన్‌ వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును తీసుకెళ్లడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. జగన్‌ భద్రతను గాలికొదిలేసిన ప్రభుత్వ వ్యవహార శైలి ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది.

Politent News Web4

Politent News Web4

Next Story