Chandrababu on Kurnool Bus Accident: కర్నూలు బస్సు దుర్ఘటన ఘటన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులతో కలిసి సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను త్వరగా గుర్తించి, మృతుల కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని సూచించారు. అలాగే, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ప్రయాణికులకు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు, పర్మిట్ల తనిఖీలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రైవేటు బస్సుల సాంకేతిక పరీక్షలు చేపట్టాలని, ఓవర్‌స్పీడింగ్, అనధికార ప్రయాణాలు నిర్వహించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని దర్యాప్తులో తేలితే బాధ్యులపై తీవ్ర చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రమాదానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ వివరాలపై పూర్తి నివేదికను 24 గంటల్లో సమర్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఘటన రాష్ట్రంలో రహదారి భద్రత, ప్రైవేటు ట్రావెల్స్ నియంత్రణలపై మరోసారి చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అధికారులు ప్రమాద స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story