Heavy Rains In AP : వర్షాలపై సీఎస్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
ఉత్తరాంధ్రలో తాజా పరిస్థితిని సిఎంకు వివరించిన సిఎస్ విజయానంద్

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సిఎస్కు సూచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం, కొండప్రాంతాలు కోతలకు గురికావడంతో అధికారులు ముందస్తు జాగ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ప్రజలకు సమాచారం అందించేలా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని... అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సిఎం అన్నారు. ముందస్తు సన్నద్దతతో, అప్రమత్తతో ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా చూడాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతున్న పరిస్ధితుల్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తగిన జాగ్రత్తల తీసుకోవాలని సీయం సూచించారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీయం సూచించారు. అదేవిదంగా లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీయస్ విజయానంద్ ని ఆదేశించారు.
