CM Chandrababu: హీరో మోటోకార్ప్ జీపీసీ-2.0కి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
శంకుస్థాపన

CM Chandrababu: గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ముందంజలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ (జీపీసీ)-2.0 నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. “ఎక్కడ అవకాశాలు ఉన్నా వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తాం. 2018లో శ్రీసిటీలో రూ.1,600 కోట్లతో హీరో మోటార్స్కు శంకుస్థాపన చేశాం. అది అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడ తయారయ్యాయి. ఇప్పుడు రూ.750 కోట్లతో గ్లోబల్ పార్ట్స్ సెంటర్కు శంకుస్థాపన చేశాం. రానున్న 3-4 ఏళ్లలో రూ.3,200 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి హీరో మోటార్స్ కట్టుబడి ఉంది” అని తెలిపారు.
హీరో మోటార్స్ ద్విచక్ర వాహనాల రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల సంఖ్య కలిగిన సంస్థ అని, ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని, ఏపీని మించిన లాజిస్టిక్స్ హబ్ మరొకటి లేదని, దేశంలోని 25 శాతం పెట్టుబడులను ఏపీ ఆకర్షించిందని అన్నారు.
ఈ కార్యక్రమం ఏపీలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంపొందడంలో మైలురాయి అని సీఎం వ్యాఖ్యానించారు.

