CM Chandrababu Reviews National Highway Projects in Andhra Pradesh: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి ఊపందుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం క్యాంప్ కార్యాలయంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన, డీపీఆర్ దశలో ఉన్న రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులన్నీ 2029 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

బెంగళూరు నుంచి రాజధాని అమరావతికి కనెక్టివిటీ కల్పించే కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్ (బెంగళూరు-కడప-విజయవాడ హైవే) నిర్మాణ పనులను వచ్చే ఏడాదికి పూర్తి చేసి, ట్రాఫిక్ కోసం అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు.

సమీక్షలో సీఎం చంద్రబాబు ముఖ్య ఆదేశాలు:

రహదారుల ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతే సరుకు రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, దానికి తగినట్లు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న జాతీయ రహదారులన్నింటినీ వాహన రద్దీని బట్టి నాలుగు లేదా ఆరు వరుసలుగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలి.

పోర్టులతో హైవేల అనుసంధానం తప్పనిసరి:

మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులను జాతీయ రహదారులతో బలంగా అనుసంధానం చేయాలి.

పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీ పోర్టులకు సులభమైన కనెక్టివిటీ ఏర్పడేలా చూడాలి.

నాగ్‌పుర్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం, జగదల్‌పుర్, రాయ్‌పుర్‌ల నుంచి మూలపేట పోర్టుకు అనుసంధానం చేసే రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలి.

ఖరగ్‌పుర్ నుంచి అమరావతి వరకు ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే డీపీఆర్‌లను త్వరగా సిద్ధం చేయాలి.

ప్రాధాన్యతా క్రమంలో ఉన్న ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు అనుమతులన్నీ తీసుకుని, పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

రాష్ట్ర రహదారుల్లో గుంతలు లేకుండా చూడాలి:

రాష్ట్రంలోని 45 వేల కి.మీ. మేర ఉన్న ఆర్‌అండ్‌బీ జిల్లా, రాష్ట్ర రహదారుల్లో ఎక్కడా గుంతలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలి.

రోడ్ అసెస్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (రామ్స్) ద్వారా అన్ని రోడ్ల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి.

పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) ఆధారంగా 12 రహదారుల విస్తరణ పనులు త్వరగా ప్రారంభించాలి.

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో రోడ్లు త్వరగా దెబ్బతినకుండా పటిష్ఠంగా నిర్మించాలి.

అధికారులు సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.2,500 కోట్లతో 6,054 కి.మీ. రహదారుల రెన్యువల్, నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. డేనిష్ ఫైబర్, వేస్ట్ ప్లాస్టిక్ బిటుమిన్, నానో కాంక్రీట్ టెక్నాలజీలతో ప్రయోగాత్మకంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు.

సమావేశంలో ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్వో ఆర్కే సింగ్, ఈఎన్‌సీలు రామచంద్ర, వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story