తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం ఏర్పాటుపై పరిశీలన...

తిరుమల వెంకటేశ్వరుడి గగన తలంపై ఎటువంటి ద్రోణులు ఎగరవేయకుండా యాంటీ డ్రోణ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల దూరం పరిధిలో గగనతలంపై ఎటువంటి డ్రోన్ కెమెరాలు సంచరించే అవకాశం లేకుండా యాంటీ డ్రోన్ సిస్టం ఏర్పాటుపై టీటీడీ పరిశీలిస్తోంది. తిరుమల కొండపై ఉన్న భద్రతా పరిస్థితులు ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకొని, సీమాంతర ఉగ్రవాదం, సరిహద్దుల్లో ఇటీవల చోటు చేసుకున్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, హిందూ దేవాలయమైన తిరుమల శ్రీవారి ఆలయం పై ముష్కర మూకలు దాడి చేసే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని యాంటీ డ్రోన్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని ఇటీవలే పాలకమండలి నిర్ణయించింది.
టీటీడీ పాలకమండలి నిర్ణయం మేరకు దేశ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న భద్రతా దళాలకు అందించిన డ్రోన్ కెమెరాలను రూపొందించిన నిపుణులను టీటీడీ సంప్రదించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ సంస్ధకు చెందిన బృందం యాంటీ డ్రోణ్ సిస్టం ఏర్పాటు పరిశీలన కోసం తిరుమల చేరుకున్నారు. ఒకటిన్న కిలోమీటర్ల మేరకు గగన తలంలో డ్రోణ్లు తిరగకుండా ఏర్పాటు చేసే వ్యవస్ధ గురించి టీటీడీ అధికారులకు డెమో ఇచ్చారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి తిరుమలలో యాంటీ డ్రోణ్ సిస్టమ్ ఏర్పాటుకు టీటీడీ సన్నద్దమవుతోంది.
