సంక్షేమానికి నిధులు సమకూరేలా ప్రణాళికలు రూపొందించండి

- ఆర్థిక సుస్థిరత కోసం సేవల రంగంపై దృష్టి పెట్టండి
- ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై విభిన్న మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ
- తలసరి ఆదాయంలో ఏడాదిలో మెరుగైన ఫలితాలు మంచి పరిణామం
- ప్రణాళికా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
సంక్షేమ పథకాలు అమలు చెయ్యడానికి అవసరమైన వనరులు సమకూరడంతో పాటు రాష్ట్ర అర్థిక పరిస్ధితి మెరుగుపడేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రణాలికా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా ఆర్థిక పరిస్థితి, జీఎస్డీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ వంటి అంశాలపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రణాళిక శాఖ దృష్టి సారించాల్సిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి శాఖా మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాల్సిన బాధ్యత ప్రణాళికా శాఖదే అని సీయం చెప్పారు. రుణభారం తగ్గించుకుంటూనే సంక్షేమానికి నిధులు సమకూర్చుకోవడం అత్యంత కీలక అంశమన్నారు. రాష్ట్ర, ఆదాయ, కేంద్ర నుంచి వచ్చే నిధులే కాకుండా ఇతర ఆదాయ సమీకరణల గురంచి కొత్త మార్గాలను అన్వేషించాలని సీయం అధికారులకు సూచించారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ నిరంతరం జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 25 కెబినెట్ సమావేశాలు, 6 ఎస్ఐబీపీ సమావేశాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని గుర్తు సీయం అధికారులకు వివరించారు. ఇక్కడితో ఆగకుండా.. ఆ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
సాంకేతికతతో సమాచార విశ్లేషణ
2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం లెక్కల్లో జాతీయ స్థాయికి మించి ఏపీ పురోగతిని సాధించిందని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 8.7 శాతం మేర పెరిగితే.. ఏపీ 11.89 శాతం మేర పురోగతి నమోదు చేసిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన డేటా అనలిటిక్స్ కోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చెప్పారు. 2028-29 నాటికి 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మెరుగ్గా ప్రజాభిప్రాయ సేకరణ
ప్రభుత్వ సేవలు, విభాగాల పనితీరు మీద నిరంతరం ప్రజాభిప్రాయం తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి చేరేలా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, క్యూఆర్ కోడ్ విధానాల ద్వారా ప్రస్తుతం చేపడుతున్న అభిప్రాయ సేకరణతోపాటు.. మరిన్ని భిన్నమైన మార్గాల ద్వారా కచ్చితమైన సమాచారం రాబట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సహా ప్రణాళిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
