Cyclone Montha: మొంథా తుపాను: బలపడి వణికిస్తున్న వాయుగుండం.. మంగళవారం తీరం దాటే అవకాశం
మంగళవారం తీరం దాటే అవకాశం

Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుపానుగా మారింది. వాతావరణ అధికారుల ప్రకారం, ఈ తుపాను మంగళవారం తీవ్ర తుపానుగా మారి, మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలు అప్రమత్తంగా ఉన్నాయి.
నైరుతి-ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశలో కదులుతోంది. గత 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగింది. ప్రస్తుతం విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 570 కిలోమీటర్లు, చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్లు, పోర్ట్ బ్లెయిర్కు పశ్చిమంగా 750 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీర ప్రాంతాల్లో 50-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాను తీరం దాటినప్పుడు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రభుత్వం ముందస్తు చర్యలు: సెలవులు, షెల్టర్లు
మొంథా తుపాను దాడి ఆందోళన కలిగిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టింది. అధికారుల సెలవులు రద్దు చేసి, సహాయక కార్యక్రమాలకు రూ.19 కోట్ల నిధులు విడుదల చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు సిద్ధం చేశారు. 57 తీర ప్రాంత మండలాల్లో 219 తుపాను షెల్టర్లు ఏర్పాటు చేశారు. సముద్రంలో ఉన్న 62 మెకనైజ్డ్ బోట్లను తిరిగి ఒడ్డుకు పిలిచారు. తీరాల్లో పర్యాటకుల రాకపోకలు నిషేధించారు.
అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో మంగళవారం వరకు సెలవులు ఉన్నాయి. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా నేడు సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలు మోహరించారు. 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్లో ఉన్నాయి. టీఆర్-27 కింద నిధులు మంజూరు చేసి, సహాయ శిబిరాలు, తాగునీరు, ఆహార సరఫరా ఏర్పాటు చేస్తున్నారు.
విజయనగరం జిల్లా ముక్కాం తీరప్రాంతంలో కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. మత్స్యకారులతో సమావేశమై, సురక్షిత చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ తుపాను కారణంగా తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

