• మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఆస్తుల జప్తు
  • ప్రజా పోలీసింగ్ తో గంజాయి, డ్రగ్స్ రహిత రాష్టంగా ఏపీ
  • ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డీ-అడిక్షన్ సెంటర్లు
  • సెలబ్రిటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం చేయాలి
  • గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా గుంటూరులో 'డ్రగ్స్ వద్దు బ్రో' వాకథాన్
  • హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

డ్రగ్స్, గంజాయిలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధానికి ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. గుంటూరులో ఫీవర్ ఆస్పత్రి జంక్షన్ నుంచి మిర్చి దాబా వరకు గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించిన 'డ్రగ్స్ వద్దు బ్రో' వాకథాన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విద్యార్ధినీ విద్యార్ధులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ పట్టుకుని సీఎం నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఏపీని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలంటూ ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. యువతను గంజాయి, డ్రగ్స్‌కు బానిస చేసి... సమాజాన్ని పీడిస్తున్న మాఫియాను తరిమేద్దామని సీఎం పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే ఆస్తుల జప్తే

ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంది. ఈ తరహా సమస్యలు పెరిగితే ఇబ్బందులు వస్తాయి. గంజాయి రవాణ, సాగు చేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నా. సాగుచేసినా, బయట నుంచి తీసుకువచ్చి విక్రయించినా సహించేది లేదు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపాం. ఇంకా అదే పని చేస్తామంటే చూస్తూ ఊరుకోం. టెక్నాలజీతో డ్రోన్లు వినియోగించి నేర నియంత్రణ చేస్తున్నాం, సీసీటీవీ కెమెరాలతో నేరాలు జరక్కుండా చూస్తున్నాం. కేసులు పెట్టడమే కాదు.. గంజాయి, డ్రగ్స్ విక్రయించిన వారి ఆస్తులు కూడా జప్తు చేస్తాం. జప్తు చేసిన ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయంతో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలకు.. అవగాహన కల్పించేందుకు వినియోగిస్తాం.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మత్తు నుంచి యువతను బయటకు తెస్తాం

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను బయటకు తెచ్చేలా కార్యాచరణ చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. “దేశంలో ఉత్పత్తి అవుతున్న గంజాయిలో ఒడిశా, ఏపీలోనే 50 శాతం సాగు అవుతోంది. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయంలో 2 శాతాన్ని మాదకద్రవ్యాల నియంత్రణకు ఖర్చు చేస్తున్నాం. మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నాం. విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతిలలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నాం. అన్ని జిల్లాల్లోనూ నార్కోటిక్స్ కంట్రోల్ సెంటర్లు పెట్టాం. పాఠశాలల్లో ఈగల్ క్లబ్పులు ఏర్పాటు చేశాం. ప్రపంచ స్థాయీ ప్రమాణాలతో మూడు ప్రాంతాల్లో డీ-అడిక్షన్ సెంటర్లతో పాటు.. రాష్ట్రంలో 56 డీఅడిక్షన్ సెంటర్లు పెడుతున్నాం. గంజాయి నివారణకు ప్రజలూ సహకరించాలి. సెలబ్రిటీలు కూడా వీటికి వ్యతిరేకంగా ప్రజాచైతన్యం కోసం ప్రచారం చేయాలి. కోదాడ వద్ద జరిగిన ఓ ఘటనలో ఓ తల్లిపడిన ఆవేదన చాలా బాధ కలిగించింది.” అని చంద్రబాబు అన్నారు.

డ్రగ్స్, గంజాయిపై ఫిర్యాదులకు వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్లు

మత్తుపదార్ధాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు బాధ్యత తీసుకోవడమే కాదని.. దీనికి ప్రజా మద్దతు కూడా అవసరమని చంద్రబాబు అన్నారు. ప్రజా పోలీసింగ్ ద్వారానే డ్రగ్స్, గంజాయిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టగలమని స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాటు చేసిన ఈగిల్ టాస్క్ ఫోర్సు ఫిర్యాదుల కోసం వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ టోల్ ప్రీ, వాట్సప్ నెంబరును ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. టోల్ ఫ్రీ నెంబరు 1972, వాట్సప్ నెంబరు 8977781972లను సీఎం విడుదల చేశారు. ఈ నెంబర్లకు సమాచారం అందించి డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని సీఎం పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నివారణకు పని చేసిన వివిధ వ్యక్తులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులను చంద్రబాబు సన్మానించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story