Deputy CM Pawan Kalyan: మునికూడలి మోడల్ను అనుసరించి మిగిలిన పుష్కర పంచాయతీలను అభివృద్ధి చేయాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిని మోడల్ పుష్కర పంచాయతీగా అభివృద్ధి చేస్తున్న నమూనాను అనుసరించి మిగిలిన పుష్కర పంచాయతీలను కూడా త్వరగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మునికూడలి అభివృద్ధికి రూ.7 కోట్లు కేటాయించి పనులు చేపట్టారు. ఈ పనులను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజలు మునికూడలిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు వివరించారు.
భుజానికి శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ తొలిసారి రాష్ట్రానికి చేరుకున్నారు. సోమవారం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత నేరుగా మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
వైద్యుల సలహా మేరకు మరో రెండు వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. అధికారిక కార్యక్రమాలు మాత్రం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

