త్వరలో విజయవాడ నుంచి నేరుగా విదేశాలకు విమాన సర్వీసులు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ ప్రయాణికుల తాకిడితో పాటు ప్రముఖుల రాకపోకలు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయని దీంతో మరో మూడు నెలల్లోనే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ఎంపీ వ్లలభనేని బాలశౌరి తెలిపారు. అలాగే 2028వ సంవత్సరం నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్ పట్టణానికి విమానం ఎగిరేలా సేవలు అందుబాటులోకి తేవడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే విదేశాలకు చెందిన ఎమిరేట్స్ విమానాలను కూడా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎయిర్ పోర్టు అభివృద్ధి కమిటీ ఛైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఇంఛార్జీ కలెక్టర్ గీతాంజలి శర్మ, డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి, జీఎం రామాచారి, ఎస్పీ గాంగాధర రావు తదితరులు పాల్గొని విమానాశ్రయ అభివృద్ధితో పాటు ప్రయాణికుల సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ప్రతి రాష్ట్రానికి అనుసంధానం అయ్యేలా విమాన సర్వీసులు నడిపేందుకు వివిధ విమానయాన సంస్థలతో సంప్రదించినట్లు చెప్పారు. ఇవి మాత్రమే కాకుండా విజయవాడ నుంచి శ్రీలంక, సింగపూర్, థాయ్ లాండ్, దుబాయ్ లకు ఎమిరేట్స్ విమానాలు అందుబాటులోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు 70 శాతం పూర్తి అయ్యాయని మంత్రి బాలశౌరి వివరించారు. అలాగే ప్రతి నెలా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా టెర్మినల్స్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అందులో ప్రాచీన సంస్కృతి, కూచిపూడి భంగిమలు ఉంటాయన్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్ ల ఆదేశాలతోనే 12 డిజెన్లను మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేశినేని చిన్నా చెప్పారు. వారణాసి, కొచ్చి, అహ్మదాబాద్ లకు కొత్త సర్వీసులు నడిపేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు వివరించారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక వేగవంతం అయ్యాయని ఆయన చెప్పారు.
