Double Welfare for Farmers: రైతులకు రెట్టింపు సంక్షేమం: అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధులు ఒకేసారి
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధులు ఒకేసారి

Double Welfare for Farmers: రాష్ట్ర రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రూ.3,125 కోట్లు విడుదల చేయనున్నారు.
శనివారం (జూన్ 20) పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగం గుంట్లలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా ఈ మొత్తం అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సంక్షేమ పథకాల కింద ఈ ఏడాది తొలి విడతగా రూ.3,125 కోట్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయం ద్వారా రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద నిధులను విడుదల చేయనుంది. పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో ప్రతి రైతు ఖాతాలో రూ.2 వేలు జమ అవుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం రైతు సంక్షేమంలో మైలురాయి.
ఈ నేపథ్యంలో రైతులు రెట్టింపు లాభాలు పొందనున్నారు. ఇంతలోనే జూన్ 30న తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిరలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమాలు రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయని రైతు సంఘాలు స్వాగతం పలుకుతున్నాయి.

