తల్లికి వందనం పథకం అమలుకు సర్వం సిద్దం

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తరువాత తల్లికి వందనం పథకాన్ని అమలు చేడానికి చంద్రబాబు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం ఒకటి. కూటమి ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న తల్లికి వందనం పథకం పొందాలంటే కావాల్సిన అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర విషయాలపై ఒక క్లారిటీ ఇచ్చింది.
తల్లికి వందనం పథకం అంటే ఏమిటి?
పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు.
తల్లికి వందనం పథకం అర్హతలు:
దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి.
విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి.
విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు (పేదరిక రేఖకు దిగువన ఉండాలి).
ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజా ప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు.
తల్లికి వందనం పథకం దరఖాస్తు విధానం:
ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఆయా పాఠశాలల నుంచి డేటాను సేకరించి లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో రూ.15000 జమ చేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి ఈ పథకం కింద పేరు నమోదు చేయించుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుంది.
గత ప్రభుత్వంలో 'అమ్మ ఒడి' పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. దాదాపుగా అమ్మ ఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గతంలో అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే 15 వేల రూపాయల్లో పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.2000 కట్ చేయగా.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ.15000 మొత్తం తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. ఇక కొత్తగా ఈ పథకం కింద చేరేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.
ఆన్లైన్ దరఖాస్తు విధానం:
ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ విధానం అందుబాటులో లేదు. ఈ పథకం కోసం ప్రత్యేకంగా అధికారిక వెబ్సైట్, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని భవిష్యత్తులో తీసుకొచ్చే అవకాశం ఉంది.
తల్లికి వందనం పథకం ధరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
ఆధార్ కార్డు (తల్లి మరియు విద్యార్థి)
తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు
పాఠశాల రికగ్నిషన్ సర్టిఫికెట్ (లేదా విద్యార్థి ప్రస్తుత పాఠశాల నుండి ధృవీకరణ)
ఆదాయ ధృవీకరణ పత్రం
అడ్రస్ ప్రూఫ్
విద్యార్థి హాజరు వివరాలు
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు (విద్యార్థి మరియు తల్లి)
లింకింగ్ తప్పనిసరి..
తల్లికి వందనం పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే, విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానించడం (NPCI లింకింగ్) తప్పనిసరి. సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. లేదా నెట్ బ్యాకింగ్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్ను లింక్ చేసుకునే అవకాశం ఉంది. మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఎన్పీసీఐ లింకింగ్ అయ్యిందో, లేదో కూడా మీ సేవా కేంద్రాల ద్వారా చెక్ చేసుకోవచ్చు.
NPCI అధికారిక వెబ్సైట్ https://www.npci.org.in ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ను లింక్ చేయడం వల్ల లబ్ధిదారుల గుర్తింపు తేలిగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ పథకం నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.దీంతో పాటు తల్లి, వారి పిల్లల వివరాలను హౌస్ హోల్డ్ డేటా బేస్లో నమోదు చేయించుకోవాలి. హౌస్ హోల్డ్లో కూడా ఈకేవైసీ చేయాలి. విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసి ఉండాలి.
తల్లికి వందనం స్కీమ్ ఎంపిక ప్రక్రియ:
దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి అర్హత ప్రమాణాలను గుర్తిస్తారు. కుటుంబం ఆర్థిక స్థితి, విద్యార్థి హాజరు శాతం లాంటి అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తారు. ఈ పథకం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతగానో తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
