Minister Nara Lokesh: త్వరగా అనుమతులు ఇవ్వడం వల్ల ఏపీలో పెట్టుబడుల వరద: మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh: రాష్ట్రంలో అనుమతులు త్వరగా మంజూరు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీ పడుతూ పరిశ్రమలను ఆకర్షిస్తున్నామని వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా సిమెంట్ సంస్థ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. దాల్మియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ దాల్మియాతో కలిసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, భారత్కు వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని తెలిపారు. సిమెంట్ ఉత్పత్తి రంగంలో దాల్మియా గ్రూప్ బలమైన స్థాపన కలిగి ఉందని, దీని వల్ల అనేకులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు లోకేశ్ విమర్శించారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించడానికి రెండేళ్లుగా అహర్నిశలు కృషి చేస్తున్నామని వెల్లడించారు. రూ.3,100 కోట్లతో చేపట్టిన ఈ పరిశ్రమ విస్తరణ ద్వారా మరో 700 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.

