కేంద్ర సాంస్కృతికి పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో పర్యాటక అభివృద్ధి వేగవంతం అవుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ అన్నారు. అఖండ గోదవరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ కు ఏపీ డిప్యూటీ సీయం పవన్‌ కళ్యాణ్‌ తో కలసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్రం నిధులు రూ. 375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టబోయే ప్రాంతాన్ని పరిశీలించారు. తరువాత జరిగిన సభలో షెకావత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనలో సీయం చంద్రబాబు, డిప్యూటీ సీయం పవన్‌ కళ్యాణ్‌లు కృషి చేస్తున్నారన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ప్రపంచంలో పర్యాటకుల శాతం పెరిగింది భారత దేశంలోనే అని షెకావత్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ లో టూరిజం అభివృద్ధికి అనుకూల పరిస్ధితులు ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి రూ.450 కోట్ల కేంద్ర నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, గిడ్డి సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, డిసిసిబి ఛైర్మన్ తుమ్మల రామస్వామి, జిల్లా, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated On 26 Jun 2025 3:59 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story