ప్రారంభించిన అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి


తిరుమ‌ల‌లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భ‌క్తుల‌ రాకపోకల నిమిత్తం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బ‌స్సు స‌ర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలిపారు. తిరుమ‌ల‌లోని అశ్వినీ ఆసుప‌త్రి స‌ర్కిల్ వ‌ద్ద గురువారం ఉద‌యం ఆర్టీసీ బ‌స్సుల ఉచిత ట్రిప్పుల‌ను ఆయ‌న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తిరుమ‌ల‌లో ప్రైవేట్ వాహ‌నాలు భ‌క్తుల నుండి వ‌సూలు చేస్తున్న అధిక ఛార్జీల‌ను అరిక‌ట్ట‌డంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పాల‌ని ఏపీఎస్ ఆర్టీసీని కోరిన‌ట్లు చెప్పారు. టీటీడీ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ అధికారులు త్వ‌రిత‌గ‌తిన బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావ‌డం పట్ల ఆయన కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాలు తిరిగే మార్గంలోనే ఈ బ‌స్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి భ‌క్తుల‌ను ఉచితంగా చేర‌వేస్తాయ‌ని చెప్పారు.

ఇప్ప‌టికే టీటీడీ శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాల ద్వారా తిరుమ‌ల‌లో ప్ర‌తిరోజూ 300 ట్రిప్పుల‌ను తిప్పుతోంద‌ని చెప్పారు. ఆర్టీసీ బ‌స్సులు తోడ‌వ్వ‌డంతో అద‌నంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ప్ర‌తి రెండు నిమిషాల‌కు బ‌స్సులు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ బ‌లోపేతమవ్వ‌డంతో పాటు బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని చెప్పారు. భ‌క్తులు బ‌స్టాండ్ వ‌ద్ద‌కు రాకుండా తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బ‌స్సులను ఎక్క‌డం ద్వారా నేరుగా తిరుప‌తికి వెళ్లేందుకు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో ఏ ప్రాంతంలో బ‌స్సు ఎక్కినా తిరుమ‌ల నుండి తిరుప‌తికి మాత్ర‌మే ఛార్జీలు ఉంటాయ‌ని, ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ స‌ర్వీసుల‌ను భ‌క్తులు వినియోగించుకోవాల‌ని ఆయ‌న భ‌క్తుల‌ను కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ పైడి చంద్ర‌శేఖ‌ర్, టీటీడీ ట్రాన్స్ పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవో లోక‌నాథం, తిరుప‌తి జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి వెంక‌ట‌రావు, డిప్యూటీ సీటీఎం విశ్వ‌నాథ్‌, డిప్యూటీ సీఎంఈ బాలాజీ, అలిపిరి డిపో మేనేజ‌ర్ శ్రీ‌హ‌రి, తదితరులు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story