AP Government: ఆ ఐపీఎస్లకు ప్రభుత్వం మళ్లీ షాక్
ప్రభుత్వం మళ్లీ షాక్

AP Government: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఏపీ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఆంజనేయులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గతంలో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
సస్పెన్షన్పై రివ్యూ కమిటీ సెప్టెంబర్ 2న సమావేశమై, జత్వాని కేసు తాజా పరిణామాలను పరిశీలించింది. సస్పెన్షన్ ఎత్తివేస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. దీంతో ఆయన సస్పెన్షన్ను మరో ఆరు నెలలు పొడిగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఫలితంగా 2026 మార్చి 8 వరకు ఆంజనేయులు సస్పెన్షన్లో ఉంటారు.
ఇదే కేసులో మరో ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటాపై కూడా ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. ఆయన సస్పెన్షన్ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సస్పెన్షన్ ఎత్తివేస్తే కేసుపై ప్రభావం పడుతుందని రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. దీంతో 2026 మార్చి 8 వరకు కాంతి రాణా టాటా సస్పెన్షన్లోనే ఉంటారు.
