Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసులో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసును సీబీఐకి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీబీఐకు లేఖ రాయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కేస్ పై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఐడీ అధికారులతో మాట్లాడి కేసు దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించేందుకు కర్నూలు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై పవన్ కళ్యాణ్ ఒత్తిడి తేవడంతో, గత వైసీపీ ప్రభుత్వం ముందుకు కదిలింది. కానీ అప్పటికే సాక్ష్యాధారాలు లేకుండా చేశారని అధికారులు ఆరోపించారు. దీంతో ఈ కేసును కూటమి ప్రభుత్వం సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసుపై స్పందించిన విషయం అందరికి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తాను చేసిన పోరాటాన్ని సుగాలి ప్రీతి తల్లి మర్చిపోవడం బాధాకరమన్నారు. ఆపదలో ఉన్నప్పుడు చేయందించిన తననే ఇలా దూషించడం సరైందా? అని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేనప్పుడు. సుగాలి ప్రీతి తల్లి పడే బాధను చూసి జనసేన పోరాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జనసేన చేసిన పోరాటం కారణంగానే సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించారు. జనసేన పోరాటంతోనే సుగాలి ప్రీతి కుటుంబానికి దిన్నెదేవరపాడులో ఐదెకరాల పొలం, కర్నూలులో 5 సెంట్ల స్థలం సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
2000 17 సంవత్సరం ఆగస్టు 10 న సుగాలి మృతి చెందింది. కర్నూలులోనే పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ ప్రీతి మృతదేహం కనిపించింది. ప్రీతి మృతి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ హయాంలో సీబీఐకి అప్పగించిన దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని కూటమి నేతల హామీ మేరకు ప్రభుత్వం ప్రీతి కేసును మరోసారి సీబీఐకి అప్పగించింది.
