డిక్లరేషన్‌ విడుదల చేసిన సీయం చంద్రబాబు

రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలాని లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఉండవల్లిలోని సీయం క్యాంపు కార్యాలయంలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్ని చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌, నెడ్‌ క్యాప్‌ ఎండీ కమలాకర్లతో కలసి చంద్రబాబు గ్రీన్‌ హైడ్రోజన్‌ డిక్లరేషన్‌ విడుదల చేశారు. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ ఈ డిక్లరేషన్ విడుదల చేశారు. భారత్‌లో స్వచ్ఛమైన ఇంధనాల ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు విధివిధానాలు రూపొందించేలా డిక్లరేషన్ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ పై ఇటీవల అమరావతిలో 600 మంది ప్రతినిధులతో సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్‌లో చర్చించిన అంశాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం డిక్లరేషన్ ప్రకటించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టంను రాష్ట్రంలో నెలకొల్పటమే డిక్లరేషన్ ఉద్దేశమని చంద్రబాబు తెలిపారు. 2027 నాటికి 2 గిగావాట్లు, 2029కి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ లక్ష్యంగా, 2029 నాటికి ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా డిక్లరేషన్‌ రూపొందించినట్లు చెప్పారు. కిలో హైడ్రోజన్ గ్యాస్ రూ.460 నుంచి రూ.160కి తగ్గించేలా పరిశోధనలు, కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2029 నాటికి 25 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ పంపిణీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ తీర్చిదిద్దాలని డిక్లరేషన్‌లో నిర్ణయించారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనల కోసం రూ.500 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ దిశగా కృషి చేసే 50 స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించాలని డిక్లరేషన్‌లో పొందుపరిచారు.

Updated On 21 July 2025 1:38 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story