AP Districts : వచ్చేనెల 15 నాటికి జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై జీవోఎం నివేదిక
ఆంధ్రప్రదేశ్ జిల్లాల విభజనపై నేడు సచివాలయంలో తొలిసారి భేటీ అయిన జీఓఎం

- ఈనెల 29,30 తేదీల్లోఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మంత్రుల పర్యటన
- ప్రజా ప్రతినిధులు,ప్రజల నుండి వినతుల స్వీకరణ
- వినతులు ఇచ్చేందుకు సెప్టెంబర్ 2 ఆఖరు తేదీ
జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై వచ్చే నెల 15 తేదీ నాటికి తమ నివేదిక సీఎం చంద్రబాబుకు సమర్పించాలని మంత్రుల బృందం (జీవోఎం) నిర్ణయించింది. రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తోపాటు ఏడుగురు మంత్రులతో ఏర్పాటైన జీవోఎం తొలిసారిగా బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో భేటి అయ్యింది. ఈ సమావేశానికి మంత్రి అనగానితో పాటు మంత్రులు పి.నారాయణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తోపాటు రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 31లోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియ మొత్తంగా ముగించాల్సి ఉన్నందున జీవోఎం తన నివేదికను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్వీభజన సక్రమంగా చేయని కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటన్నింటిని సరిచేసేందుకే జీవోఎంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈనెల 29,30 తేదీల్లో మంత్రుల బృందం రెండు గ్రూపులుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తుందని,ఆ సమయంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తామని చెప్పారు.ఇప్పటికే ప్రభుత్వం వద్దకు వచ్చిన అనేక సూచనలపై చర్చించామని, రానున్న కాలంలోనూ వినతులు స్వీకరించి వాటన్నింటినీ క్రోడికరించి సెప్టెంబర్ 15వ తేదీ నాటికే నివేదికను సీఎంకు అందజేస్తామని చెప్పారు.ప్రజలు ఇప్పటి నుండే కలెక్టర్లకు తమ వినతులను ఇవ్వొచ్చునని, వినతులు ఇచ్చేందుకు సెప్టెంబర్ 2 అఖరు తేదీ అని చెప్పారు. జిల్లా,డివిజన్,మండల, గ్రామాల పేర్లు,సరిహద్దుల మార్పుల తోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా జీవోఎం పరిశీలిస్తుందని చెప్పారు. అయితే నియోజకవర్గాలతో జీవోఎంకు సంబంధం లేదని, వాటి జోలికి పోవడం లేదని అన్నారు.పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో ఉండటం,ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లక్ష్యంగా తమ సూచనలు ఉంటాయని చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు గిరిజనులకు అందుబాటులో ఉండేవిధంగా రెండు గిరిజిన ప్రాంతాలను కూడా మంత్రుల బృందం పర్యటించి వారి నుండి అభిప్రాయాలు తీసుకుంటుందని చెప్పారు.
ప్రజల నుండి వినతులు జీవోఓం సమావేశం జరుగుతూ ఉండగానే దాదాపు 15 మంది జిల్లా, మండల,గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పుపై మంత్రుల బృందానికి తమ వినతులను సమర్పించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే చీరాల నుండి వచ్చిన కొందరు బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరాలకు మార్చాలని,బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య పేరు పెట్టాలని కోరారు.శ్రీకాకుళం జిల్లా మురపాక నుండి వచ్చిన బిఎస్ నాయుడుతోపాటు ఆ గ్రామస్తులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. క్రిష్ణా జిల్లా మడిచర్ల గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మరియు ఆ గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని బాపులపాడు మండలం నుండి తీసేసి నూజీవీడు మండలంలో గానీ, ముసునూరు మండలంలో గానీ కలపాలని కోరారు.
