జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక పదవిలో ఉన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన పవన్‌ కల్యాణ్‌.. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టడానికి కీలకంగా వ్యవహరించారు. గతేడాది ఇదే రోజు ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం విజయ ఢంకా మోగించింది. ఇక, పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీకి హండ్రెడ్‌ పర్సెంట్‌ స్ట్రయిక్‌ రేట్‌ లభించింది. పొత్తు కేటాయింపుల్లో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులు అందరూ గెలిచారు. అంతేకాదు.. దాదాపు 17 శాతం ఓటు బ్యాంకును కూడా జనసేన పార్టీ సొంతం చేసుకుంది.



ఇక, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖతో పాటు తనకు అత్యంత ఇష్టమైన అటవీ శాఖను అడిగి మరీ తీసుకున్నారు పవన్‌ కల్యాణ్‌. తనతో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు ఏపీ కేబినెట్‌లో అవకాశం కల్పించారు. తొలిసారి మంత్రి పదవి లభించడంతో అనుభవం కోసం కొన్ని రోజుల పాటు తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖలపై పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారని చెబుతారు. కేరళలో బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజ్‌ను తన టీమ్‌లోకి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో రహదారులు, మంచినీటి సమస్యలను పరిష్కరించేందుకు పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయనే అంటున్నారు. పంచాయతీలకు నిధులు విడుదల చేయించడంలో పవన్ కల్యాణ్ సక్సెస్ అయ్యారు. అటు.. గిరిజన ప్రాంతాల్లోనూ రోడ్లులేని మారుమూల ప్రాంతాలకు రహదారులను నిర్మించేలా ప్రత్యేకంగా పర్యటనలు చేసి.. కేంద్ర నిధులు విడుదల చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఫలితంగా అటవీ పుత్రులకు అండగా తాను ఉన్నానన్న భరోసాను పవన్ కల్యాణ్ ఇవ్వగలిగారు. ఇక ఏనుగుల దాడి నుంచి పంటలను రక్షించేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తీసుకురావడంలో కూడా పవన్‌ కల్యాణ్‌ కీలకంగా వ్యవహరించారు.



అయితే, కూటమి ప్రభుత్వం యేడాది పాలనలో పవన్ కల్యాణ్ కొన్ని నిర్ణయాల పట్ల మౌనంగా ఉండటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం ఆయన ఇమేజ్‌ను కాస్తంత డ్యామేజీ చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ గతంలో ఎన్నడూ అధికారంలో లేకపోవడంతో కాస్త కొత్తగానే ఉంటోంది. పైగా.. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్లు ఎక్కువయ్యారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు తనకు తాను ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించడం మానేశారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున సర్కారు నిర్ణయాలకు ప్రతీ దానికీ తలూపటమే పవన్‌ కల్యాణ్‌పై విమర్శలకు కారణమవుతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత సమస్యల పరిష్కారంపై చూపించడం లేదని, పవన్‌ కల్యాణ్‌ మౌనాన్ని సోషల్ మీడియాలో చాలా మంది తప్పుపడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కారణంగా ప్రభుత్వంపైనే బహిరంగ విమర్శలు చేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అంతర్గత సమావేశాల్లోనే తన అభ్యంతరాలను వెలిబుచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే.. కేబినెట్‌లో కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి బహిరంగంగా విమర్శలు చేస్తే అది ప్రభుత్వానికి పరోక్షంగా తనకు కూడా చెడ్డపేరు తెస్తుంది. అయితే, అంతర్గత సమావేశాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ, పవన్ కల్యాణ్ అంతర్గత సమావేశాల్లో కూడా తలూపడం వల్లే ఈ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ గత ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలపై వైసీపీ నేతలు పవన్ కల్యాణ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ నిజాయితీగా ఉన్నప్పటికీ, తన శాఖల విషయంలో మంచి పురోగతి సాధించినప్పటికీ ప్రశ్నించడం మానేసి ప్రజల్లో చులకనయ్యారని చెబుతున్నారు.




Updated On 5 Jun 2025 2:18 PM IST
Politent News Web4

Politent News Web4

Next Story