నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు
ముద్రగడ పద్మనాభరెడ్డి బహిరంగ లేఖ

తనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్దితిపై ఇటీవల ఆయన కుమార్తె ఆందోళన వ్యక్తం చేయడం పట్ల ముద్రగడ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈమద్య మాకుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి, మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్దలు వచ్చాయి. ఒక సంవత్సరము నుంచి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయి. వారి జోలికి నేను వెళ్ళడం లేదు, అయినా మమ్ములను టార్గెట్ చేస్తున్నారు. కారణం మా చిన్నాబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగలిపోతున్నారు. నాకు కేన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు, అతని మామ పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారు. ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్నకొడుకే నూటికి వెయ్యి శాతం కారణం అని చెబుతున్నాను. రోజు అన్ని సేవలు నాకు చేయకుండా గిరి బయటకు వెళ్లడు. గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైద్రాబాద్ హాస్పటల్లో ఆపరేషన్ చేయించుకుని సుమారు 15 రోజులు తరువాత హాస్పటల్ నుంచి విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటి నుంచి బయటికి పంపిన సంగతి మీ ఇరువురూ మరిచారా అంటూ ముద్రగడ తన లేఖలో ప్రశ్నించారు. ఇప్పుడు మీ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవు. నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నాను నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నాను. నన్ను బంధించి ఉంచడం కాని, మానసికంగా హింసించడం కాని ఎవ్వరి తరం కాదని తెలియజేస్తున్నానని ముద్రగడ సోమవారం విడుదల చేసిన లేఖలో పేర్కోన్నారు.
ఇదే లేఖలో తుని రైలు దహనం కేసు విషయంలో ప్రభుత్వం విచారణకు జీఓ ఇచ్చి మళ్ళీ ఉప సంహరించుకున్న వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ జీ.వోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు మీకు అంత దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్లను, ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ పధకాలును అమలు చేయించి మీ డబ్బా కొట్టుకోండి అంటూ తన కుమార్తె కుటంబానికి లేఖలో సూచించారు. ఒకవేళ నిజంగా అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని, లోకేష్ బాబుని, ఉప ముఖ్యమంత్రిని చూసి జాలి పడుతున్నానని ముద్రగడ లేఖలో అన్నారు.
