Minister Nara Lokesh: నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh: తన యువగళం పాదయాత్రలో వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను ఎప్పటికీ మరచిపోనని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈరోజు తిరుపతిలో కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ వేడుకలో పాల్గొన్న లోకేశ్, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కార్యక్రమంలో యువగళం బృంద సభ్యులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్, పాదయాత్ర రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సుమారు 15 నిమిషాల పాటు కార్యకర్తలతో ముచ్చటించిన ఆయన, యువగళం విజయవంతం కావడంలో టీడీపీ కేడర్ పాత్ర కీలకమని ప్రశంసించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎదురైన అణచివేతలు, ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కార్యకర్తే అధినేత’ అనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కేడర్ను సాధికారత కల్పించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదల, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కానిస్టేబుల్ నియామకాలు వంటి అంశాల్లో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని లోకేశ్ అన్నారు.
యువగళం ద్వారా ఏర్పడిన బంధం శాశ్వతమని, కార్యకర్తలతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని మరోసారి లోకేశ్ స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

