ప్రజల దృష్టిలో చంద్రబాబు మొదటి బంతికే ఔట్ అయ్యారు - బుగ్గన

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఏడాది కాలంలో అమలు చేసేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ అమలు చేసానని చెప్పుకుంటున్న చంద్రబాబా నాయుడు ప్రజల దృష్టిలో మొదటి బంతికే అవుటయ్యారని బుగ్గన అన్నారు. మా హాయంలో హామీలన్నీ అమలు చెయ్యడమే కాకుండా హామీ ఇవ్వని అనేక పధకాలు కూడా అమలు చేశామని కానీ కూటమి ప్రభుత్వం హామీలన్నీ అప్పుడే అమలు చేసేసినట్లు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులు తగ్గి ఆదాయం పెరిగిందని, కూటమి సర్కార్ వచ్చిన ఏడాదిలోనే ఆదాయం తగ్గి అప్పులు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి గణాంకాలతో వివరించారు. ఇటువంటి వాస్తవాలను మరుగునపెట్టి మంచి పాలన అందిస్తున్నామని చెప్పుకుంటూ పైగా ఎన్నికల హామీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమంటూ బెదిరింపులకు దిగడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. తాను వెల్లడించిన గణాంకాలు తప్పని చంద్రబాబు నిరూపించగలరా అని బుగ్గన సవాల్ విసిరారు. ఎన్నికల మందు రాష్ట్రంలో ఉన్న 87 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అందులో 30 లక్షల మందికి ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. అది కూడా రూ.13 వేలే ఇస్తున్నారని మండిపడ్డారు. అలాగే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి హామీలను కూడా తుంగలో తొక్కారన్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఈ విషయాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని బుగ్గన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని దుకాణాలు వెలవెల బోతుంటే మద్యం దుకాణాలు మాత్రం కళకళ్ళాడుతున్నాయన్నారు. కూటమి ఏడాది పాలనై కేకే సర్వేలో కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు.
