• శ్రీవారి మెట్టు మార్గంలో ఎస్ ఎస్ డి టోకెన్ల జారీ కౌంటర్ల మార్పు !?
  • ఆలయంలో కౌంటర్ ఏర్పాటుకు ఆర్కియాలజీ శాఖ అనుమతి
  • అలిపిరి నడక మార్గంలోనూ దర్శన టోకెన్ల జారీ?

ఆటోవాలాల చేతిలో మోసపోతున్న వెంకటేశ్వరస్వామి భక్తులకు ఉపశమనం కలిగేలా శ్రీవారి మెట్టు మార్గంలో ఎస్ ఎస్ డి టోకెన్ల జారీ కౌంటర్లను మార్పు చేయాలని టిటిడి నిర్ణయించింది. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో ఆరంభంలో ఉన్న ఈ దర్శన టోకెన్ల కౌంటర్లను అక్కడి నుండి తరలించి శ్రీనివాస మంగాపురం లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టోకెన్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశాలమైన స్థలంలో ఎస్ ఎస్ డి టోకెన్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియాలజీ విభాగానికి టిటిడి ఇటీవలే లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియాలజీ విభాగం టీటీడీకి అనుమతి ఇస్తూ అంగీకార లేఖను టీటీడీ అధికారులకు అందజేసింది. దీంతో ఇక్కడ కౌంటర్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తున్న సామాన్య భక్తులు కాలినడకన శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ప్రతినిత్యం దాదాపు 15 వేల నుండి 25 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరి కోసం శ్రీవారి మెట్టు వద్ద ప్రతినిత్యం 5000 దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. అయితే ఈ టోకెన్లు పొందేందుకు తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టిసి బస్టాండ్ ప్రాంతాల నుండి ఆటో వాలాలు శ్రీవారి భక్తులను ఎక్కించుకొని కేవలం 25 కిలోమీటర్ల దూరం కి ఒక్కో భక్తుని వద్ద నుండి వెయ్యి రూపాయల చొప్పు న ఒక్కో ఆటోలో 8 మందిని ఎక్కించుకొని ఎనిమిది వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని శ్రీవారి మెట్టు మార్గం వరకు అత్యంత వేగంగా ప్రయాణించడంతో ఈ మార్గంలో ప్రమాదాలకు జరగడం నిత్య కృత్యమైంది. భక్తులను మభ్యపెట్టి శ్రీవారి దర్శనం టోకెన్లు ఇప్పిస్తామని చెప్పి ఆటోవాలాలు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ భక్తులను మోసగించడం పట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. భక్తులను మోసగించేందుకు ఇక్కడ ఆటోవాలాలమాఫియా ముఠా తయారయిందని టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించారు.

టిటిడి ఉన్నతాధికారులు ఆటోవాలల దోపిడీ నుంచి సామాన్య భక్తులను కాపాడేందుకు ప్రత్యామ్నాయం ఆలోచించారు. శ్రీవారి మెట్టు మార్గం వద్దనున్న ఎస్ ఎస్ దర్శన టోకెన్ల కౌంటర్లను అక్కడినుండి శ్రీనివాసమంగాపురం ఆలయంలోనికి మార్పు చేస్తే కొంత మంచి ఫలితాలు రాబట్టవచ్చని టీటీడీ బోర్డుకు ప్రతిపాదించారు. శ్రీనివాస మంగాపురం వద్ద టోకెన్లు తీసుకున్న భక్తులు అక్కడి ఆటోలతో పని లేకుండా నేరుగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు నడిచి వెళ్లే అవకాశం ఉంటుందని, తద్వారా భక్తులు ఆటోవాలా చతిలో పడి దోపిడీకి గురయ్యే అవకాశం ఉండదని అధికారులు బోర్డుకు వివరించారు.. అంతేకాకుండా అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు గతంలో లాగే దర్శన టోకెన్ల కౌంటర్ ను కూడా తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలిపిరి వద్ద ఎస్ ఎస్ డి టోకెన్ కౌంటర్ లేని కారణంగానే శ్రీవారి మెట్టు మార్గం పై భక్తుల ఒత్తిడి అధికమైందని అధికారులు గుర్తించారు.

ఈమేరకు శ్రీనివాసమంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆవరణలో శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు సర్వదర్శన టోకెన్లను జారీ చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆర్కియాలజీ నుంచి అనుమతి కూడా వచ్చినందున ఈ ఆలయంలో కౌంటర్ల ఏర్పాటు పై సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు తదితరులు కలిసి ఈ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం వీలైనంత త్వరగా ఇక్కడ ఎస్ ఎస్ డి టోకెన్ కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Politent News Web 1

Politent News Web 1

Next Story