జాతీయ సమగ్రతపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం – జనసేన 12 ఏళ్ల ప్రయాణం సారాంశం

Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో ‘జనసేన ప్రస్థానం – జాతీయ సమగ్రత’ అనే ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభించారు. వందేమాతరం గీతాలాపనతో మొదలైన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రారంభోపన్యాసం చేశారు.

జనసేన పార్టీని స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని పవన్ తెలిపారు. గత 12 ఏళ్లలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశామని గుర్తు చేశారు. “అధికారం కోసం కాదు, దేశ సమగ్రతను కాపాడటమే జనసేన ముఖ్య లక్ష్యం” అని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం దేశ సమైక్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం దేశ సమగ్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని విమర్శించారు. దేశ స్ఫూర్తిని తరతరాలకు అందించాలని ఆకాంక్షించారు.

తెలంగాణ విభజనపై స్పష్టత:

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాను ఎన్నడూ వ్యతిరేకించలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. “జనసేన తెలంగాణ విభజనకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఏపీని విభజించిన తీరుపైనే మేము ఆవేదన వ్యక్తం చేశాము” అని వివరించారు. విభజన తర్వాత కూడా ఆస్తుల పంపకం, ఇతర సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అసంతృప్తి, అశాంతిని సృష్టించిందని వ్యాఖ్యానించారు.

ఢిల్లీపై మాట్లాడుతూ, “ఢిల్లీ మెడలు వంచుతామని చాలా మంది చెబుతుంటారు. కానీ ఢిల్లీకి వచ్చాక నోళ్లు పెగులుతాయి” అని ఎద్దేవా చేశారు. దేశ రక్షణ, భద్రతకు ఢిల్లీ కీలక కేంద్రమని, స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలు ఈ నేలపై జరిగాయని, రాజ్యాంగం జన్మించిన పవిత్ర స్థలం కాబట్టే ఇక్కడ సమావేశం నిర్వహించామని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఈ సమావేశంలో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల కీలక నాయకులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story