Minister Lokesh: రైల్వే భూముల్లో నివసించే పేదలకు కూడా పట్టాలు: కేంద్రంతో చర్చలు జరుపుతున్నాం – మంత్రి లోకేశ్
మంత్రి లోకేశ్

Minister Lokesh: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ప్రభుత్వ, నిషేధిత భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలతో పాటు రైల్వే భూముల్లో నివాసం ఉంటున్న వారికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి లోకేశ్ వెల్లడించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో బుధవారం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ 1,303 మందికి అనుభవ పత్రాలు, ఇళ్ల పట్టాలను అందజేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు కార్యక్రమం సాగింది. వేదికపైకి రాలేని స్థితిలో ఉన్న లబ్ధిదారుల వద్దకు లోకేశ్ స్వయంగా వెళ్లి పట్టాలు అందించారు.
తల్లికి వందనం పథకం: తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఏటా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని లోకేశ్ తెలిపారు. పిల్లల చదువును ప్రోత్సహించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని, తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రారంభమైందని, జులై 24 వరకు జమలు పూర్తవుతాయని చెప్పారు.
వీడియో పోటీ: తల్లికి వందనం పథకం నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల కోసం 60 సెకన్ల వీడియో పోటీ నిర్వహిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ అమ్మపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే వీడియోలు అప్లోడ్ చేస్తే ఉత్తమంగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసి లోకేశ్ను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

