CM Chandrababu: దేశ హితం కోసం పొదుపు చర్యలను కఠినంగా అమలు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు పిలుపును ఆచరణలో పెట్టడం కోసం మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. ‘నా దేశం - నా బాధ్యత’ అనే నినాదంతో పొదుపు ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మంత్రులు, ప్రజా ప్రతినిధులు కేవలం కాన్వాయ్‌లు తగ్గించుకోవడం మాత్రమే కాకుండా ఇతర పొదుపు మార్గాలను కూడా అన్వేషించాలని సూచించారు. జిల్లా పర్యటనల్లో అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని, విదేశీ పర్యటనలు కూడా పరిమితం చేయాలని ఆదేశించారు. వర్చువల్ మీటింగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం:

ఎలక్ట్రిక్ వాహనాల (EVs)ను ప్రోత్సహించి రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా నిలవాలని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆదేశించారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని, కార్యాలయాల్లో ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల మధ్య మాత్రమే నడపాలని సూచించారు.

వర్క్ ఫ్రమ్ హోం అమలు:

వర్క్ ఫ్రమ్ హోం (Work from Home) విధానంపై విస్తృత అధ్యయనం చేసి స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. సౌరశక్తిని విస్తృతంగా వినియోగించుకోవాలని, దేశం మనకు ఇచ్చిన ఎన్నో సదుపాయాలకు కృతజ్ఞతగా పొదుపు చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సీఎం సూచించారు. పొదుపు చర్యలను దశలవారీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించగా, సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రతి నిర్ణయానికీ ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాత మాత్రమే ప్రకటించాలని నిర్ణయించారు.

ఈ మంత్రివర్గ సమావేశంలో పొదుపు, అభివృద్ధి, పర్యావరణ హితం మూడింటినీ సమన్వయం చేసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పం స్పష్టమైంది.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story